కల్లోలం రేపుతోన్న కరోనా: 53 వేలకు పైగా కొత్త కేసులు: నాలుగు లక్షలకు చేరువగా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. అనేక రాష్ట్రాల్లో కరోనా తీవ్రత కనిపిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చాలాకాలం తరువాత ఈ స్థాయిలో కరోనా కేసులు భయానకంగా పెరగడం ఇదే తొలిసారి. దీని ఫలితం దేశంలోని అనేక రాష్ట్రాలపై పడుతోంది. తెలంగాణలో వైద్య విద్యా కళాశాలలు మినహా అన్ని విద్యాసంస్థలు, పాఠశాలలను మూసివేశారు. పలు రాష్ట్రాల్లో వారాంతపు రోజుల్లో లాక్డౌన్ను అమలు చేస్తున్నారు. కొన్ని రాష్ట్రాల మధ్య రాకపోకలపై ఆంక్షలను విధించే అవకాశాలు పరిశీలనలో ఉన్నాయి.
ఈ పరిణామాల మధ్య దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 53,476 కరోనా కేసులు నమోదయ్యాయి. 251 మంది మరణించారు. 26,490 మంది ఆసుపత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,17,87,534కు చేరుకుంది. ఇందులో 1,12,31,650 మంది డిశ్చార్జ్ కాగా.. 1,60,692 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3,95,192కు చేరింది. ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు నమోదు కావడం కూడా సుదీర్ఘకాలం తరువాత ఇదే తొలిసారి. యాక్టివ్ కేసులు నాలుగు లక్షలకు చేరువ అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటిదాకా 23,75,03,882 చేరినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే 10,65,021 కోవిడ్ టెస్టింగులను నిర్వహించినట్లు తెలిపింది. మరో వైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 5,31,45,709 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పలువురు ప్రముఖులు టీకాలను వేయించుకుంటున్నారు. వ్యాక్సిన్ పనితీరుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను పోగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కరోనా కేసుల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. 24 గంటల్లో 31,855 కేసులు అక్కడ వెలుగులోకి వచ్చాయి. దేశవ్యాప్తంగా నమోదైన రోజువారీ కరోనా కేసుల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, పంజాబ్ వాటా 70 శాతానికి పైగా ఉంటోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, గుజరాత్, ఛత్తీస్గఢ్లల్లో కరోనా ప్రొటోకాల్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఇప్పటికే విద్యాసంస్థలు మూతపడ్డాయి. వీకెండ్లో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు.