NEWS X and TV9-GUJARATI exit polls: మోడీ-బీజేపీకే గుజరాతీల పట్టం
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీ రెండో దశ ఎన్నికల పోలింగ్ ముగియడంతో వరుసగా పలు మీడియా ఛానళ్లు, సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. అంతా అనుకున్నట్లుగానే గుజరాత్ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. గుజరాత్పై ఎంతో ఆశ పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు చేదు అనుభవం ఎదురుకానున్నట్లు తెలుస్తోంది.
న్యూస్ ఎక్స్-జన్ కీ: మరోసారి బీజేపీకే గుజరాత్ పట్టం
న్యూస్ ఎక్స్-జన్ కీ బాత్ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి 117-140 మధ్య సీట్లలో విజయం సాధిస్తుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 34-51 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి 6-13 సీట్లకే పరిమితం కానుందని వెల్లడించింది. ఇతరులకు 1-2 సీట్లు దక్కుతాయని తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ మొత్తం 182 అసెంబ్లీ స్థానాలుండగా.. 92 సీట్లు వస్తే మెజార్టీ సాధించినట్లే.
టీవీ-9 గుజరాత్ ఎగ్జిట్ పోల్స్: మళ్లీ బీజేపీకే గుజరాత్
టీవీ-9 గుజరాత్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. బీజేపీకి 125-130 మధ్య సీట్లను గెలుచుకుంటుందని అంచనా వేసింది. కాంగ్రెస్ పార్టీకి 40-50 మధ్య స్థానాలు వస్తాయని తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం 3-5 సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ఇతరులకు 3-7 సీట్లు దక్కుతాయని అంచనా వేసింది.
మోడీ పిలుపునకు సానుకూలంగా గుజరాత్ ఓటర్లు
కాగా, గుజరాత్ రాష్ట్రంలో దాదాపు రెండు దశబ్దాలుగా బీజేపీ అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా తన సొంత రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రధాని మోడీ విస్తృతంగా పర్యటించారు. గుజరాత్ ప్రజలు మరోసారి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టాలని ఓటర్లను కోరారు. గుజరాత్ అభివృద్ధి బాటలో కొనసాగాలంటే బీజేపీనే అధికారంలో ఉండాలన్నారు. ఇక గుజరాత్ ప్రజలు కూడా బీజేపీకి సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది.
కేజ్రీవాల్కు షాక్.. కాంగ్రెస్ పార్టీకి ఊరట
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కూడా గుజరాత్ రాష్ట్రంపై పెద్ద ఆశలు పెట్టుకుని విస్తృత ప్రచారం నిర్వహించారు. అయితే, కేజ్రీవాల్ ఆశించిన ఫలితం మాత్రం రాలేదని తెలుస్తోంది. తమ ఖాతాలో మరో రాష్ట్రం చేరుతుందని కేజ్రీవాల్ భావించినా.. గుజరాత్ ఓటర్లు మాత్రం ఆప్కు కాకుండా బీజేపీకే జై కొట్టారు. ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో ఎలాంటి మార్పూ లేనట్లు కనిపిస్తోంది. అయితే, ఆప్ కంటే కొంత మెరుగ్గా ఫలితాలు రావడం ఆ పార్టీకి ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తోంది.