రాష్ట్రపతి ఎన్నికలు: మీరా కుమార్ వర్సెస్ ద్రౌపది ముర్ము
వచ్చే జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వారసత్వాన్ని అందుకునే వారెవ్వరూ అన్న అంశంపై విస్త్రుత స్థాయిలోనే చర్చ జరుగుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికీ ఎన్సీపీ నేత శరద్ పవార్
వచ్చే జూలై 25వ తేదీన రాష్ట్రపతిగా ప్రణబ్ ముఖర్జీ వారసత్వాన్ని అందుకునే వారెవ్వరూ అన్న అంశంపై విస్త్రుత స్థాయిలోనే చర్చ జరుగుతోంది. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఇప్పటికీ ఎన్సీపీ నేత శరద్ పవార్ పేరు పరిశీలనలోనే ఉన్నది.
న్యూఢిల్లీ: ఒకవేళ తదుపరి రాష్ట్రపతిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారుచేస్తే.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో విపక్షం మాజీ ఉప ప్రధాని, దళిత నేత బాబూ జగ్జీవన్ రాం తనయ, లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో జాతిపిత మహాత్మాగాంధీ మనుమడు, పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలక్రుష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని కూడా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు తీవ్రంగా పరిశీలిస్తున్నాయి. ఇప్పటికే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వంపై జోరుగా చర్చ జరుగుతున్నది. శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తే శివసేనతోపాటు ఎన్డీయే మిత్రపక్షాల ఓట్లు భారీగా కొల్లగొట్టేందుకు ఆస్కారం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ లో పాల్గొనే వారికి పార్టీలు విప్లు జారీ చేయవు మరి.
డీఎంకే అధినేత ఎం కరుణానిధి జన్మ దినోత్సవం సందర్భంగా విపక్షాలు కలుసుకుని రాష్ట్రపతి అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపక్ష నేత వైఎస్ జగన్ సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ప్రకటించగా, తమిళనాట అధికార అన్నాడీఎంకే గ్రూపులు రెండూ బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికలు జరిగే ఎలక్టోరల్ కాలేజీలో స్వల్ప తేడాలు ఉన్నా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అన్నాడీఎంకే తదితర పార్టీల మద్దతుతో ఎన్డీయేకు సారథ్యం వహిస్తున్న బీజేపీ గట్టెక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ సారథ్యంలోని మోదీ ప్రభుత్వంపై భవిష్యత్ లో 2019 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రాతిపాదిక తయారుచేసుకునేందుకు విపక్షాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక శుభారంభం మాత్రమే కాగలదని విశ్లేషకులు బావిస్తున్నారు.

విపక్షాలకు మీరా కుమార్
ఒకవేళ బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తే.. ఇప్పటివరకు విపక్షాల అభ్యర్థిగా పరిశీలిస్తున్న పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలక్రుష్ణ గాంధీ అభ్యర్థిత్వాన్ని పక్కన బెట్టి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే అభ్యర్థి ఎవరన్న అంశం కోసమే విపక్షాలన్నీ వేచి చూస్తున్నాయి. ఒకసారి బీజేపీ అభ్యర్థి ఎవరన్నదీ తేలితే విపక్షాలు తమ అభ్యర్థిని ప్రకటించేందుకు అన్ని రకాల అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకున్నాయి.

ఆరెస్సెస్ వర్సెస్ గోపాల క్రుష్ణ గాంధీ
ఒకవేళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అభ్యర్థిని బరిలో దించాలని బీజేపీ భావిస్తే.. కాంగ్రెస్ పార్టీ సారథ్యంలోని విపక్షాల అభ్యర్థిగా గోపాలక్రుష్ణ గాంధీ పేరు ముందుకు రానున్నది. అనూహ్యంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీనే మరోసారి కొనసాగించాలని అధికార బీజేపీ భావిస్తే మాత్రం విపక్షాలు వ్యతిరేకించకపోవచ్చు. ముఖర్జీపై విపక్షాలు అభ్యర్థిని నిలిపేందుకు ముందుకు రాకపోవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు బాబూ రాజేంద్ర ప్రసాద్ మినహా రెండోసారి రాష్ట్రపతిగా మరెవ్వరూ పదవిలో కొనసాగలేదు. కనుక ప్రణబ్ ముఖర్జీ మరోసారి రాష్ట్రపతిగా ఉండే అవకాశాలు చాలా స్వల్పమే.

ఎన్డీయే పక్షాల ఓట్ల కోసం పవార్ అభ్యర్థిత్వం
ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఇతర ప్రతిపక్ష నాయకులంతా రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని నిలుపాలని నిర్ణయించుకున్నప్పటి నుంచి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ అభ్యర్థిత్వంపై చర్చ జరుగుతూనే ఉన్నది. చాలా పార్టీలకు ఆయన ఇష్టమైన అభ్యర్థిగా ఉన్నారు. రాజకీయ, కుల, ప్రాంత, పార్టీల వారీ సమీకరణాలను బట్టి ప్రస్తుత పరిస్థితుల్లో తదుపరి రాష్ట్రపతి అభ్యర్థి ఎవరన్న విషయం ఖరారు కానున్నది. ఒకవేళ శరద్ పవార్ అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తే శివసేనతోపాటు మహారాష్ట్రలోని ఇతర చిన్నా చితకా పార్టీలు, అకాలీదళ్ వంటి పార్టీలు మద్దతు పలికే అవకాశాలు ఉన్నాయి. అయితే బీజేపీ అభ్యర్థి ఎవరన్న విషయంపైనే శరద్ పవార్ అభ్యర్థిత్వం ఆధారపడి ఉన్నది.

ఇలా నవీన్ పట్నాయక్ మద్దతు పొందొచ్చు
ఏ రకంగా చూసినా బీజేపీ తదుపరి రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ గవర్నర్ ద్రౌపది ముర్మువైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ ఆమె అభ్యర్థిత్వం ఖరారై, ఎన్నికల్లో గెలుపొందితే దేశంలో తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు నెలకొల్పనున్నారు. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారుచేయడం ద్వారా ఒడిశాలోని అధికార బిజూ జనతాదళ్ పార్టీ (బీజేడీ) అధినేత నవీన్ పట్నాయక్ను ఆత్మరక్షణలో పడేయాలని కమలనాథులు ఉవ్విళ్లూరుతున్నారు. ఒడిశాకు చెందిన మహిళా నాయకురాలు కావడంతో నవీన్ పట్నాయక్... ఆమె అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి. ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ఖరారుచేస్తే బీజేపీకి, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం నల్లేరు మీద నడక వంటిదేనని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications