హత్రాస్ రేప్పై భగ్గుమంటున్న దేశం- రంగంలోకి నిర్భయ లాయర్- ఆరుగురిపై యోగీ వేటు
హత్రాస్లో అమానుషంగా దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరపడమే కాకుండా పోలీసుల సాయంతో రాత్రికి రాత్రే ఆమెకు దహన సంస్కారాలు జరిపించిన ఆటవిక చర్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. యూపీతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఈ ఘటనపై నిరనసలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో యూపీలోని యోగీ ఆదిత్యనాథ్ సర్కారు ఈ ఘటనకు బాధ్యుల్ని చేస్తూ ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. మరోవైపు ఈ కేసులో హత్రాస్ బాధితురాలి తరఫు వాదించేందుకు నిర్భయ లాయర్ సీమా కుహ్వాహా రంగంలోకి దిగుతున్నారు. అయితే బాధితురాలి కుటుంబ సభ్యులను కలిసేందుకు పోలీసులు ఆమెకు అనుమతి ఇవ్వడం లేదు.
హత్రాస్ ఘటనపై భగ్గుమన్న దేశం...
నిర్భయ ఘటన జరిగిన తీరుపై అప్పట్లో దేశవ్యాప్తంగా పెల్లుబికిన నిరసనకు పది రెట్లు నిరసనలు ఉత్తర్ ప్రదేశ్లో తాజాగా చోటు చేసుకున్న హత్రాస్ ఘటనపై వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా దళిత యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన నింధితులను కాపాడటమే లక్ష్యంగా ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపైనా నిరసనలు పెరుగుతున్నాయి. ఇప్పటికే రేప్ ఘటనను కప్పిపుచ్చేందుకు రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులను ఇంట్లోనే బంధించి మరీ మృతురాలికి దహన సంస్కారాలు పూర్తి చేసిన పోలీసుల తీరుపై అలహాబాద్ హైకోర్టు కూడా ఇవాళ మండిపడింది. ఈ వ్యవహారంపై సుమోటో కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా చేసింది. మరోవైపు విపక్ష పార్టీలతో సహా మిగతా ఎవరినీ హత్రాస్ వెళ్లనివ్వకుండా యోగీ ప్రభుత్వం అడ్డుపడుతోంది.
ముప్పేట దాడితో యోగీ సర్కారులో కదలిక..
హత్రాస్ ఘటన కంటే అది జరిగిన తీరు భీతావహంగా ఉండటంతో యోగీ సర్కారు తీరుపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీ, అమిత్షా సైతం యోగీకి ఫోన్ చేసి మాట్లాడినా పరిస్ధితిలో మార్పు రాలేదు. ఇంకా ఈ ఘటనలో ఏమీ జరగలేదని చెప్పేందుకు యోగీ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. తనపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు మృతురాలు మరణ వాంగ్మూలం ఇచ్చినా అలీఘర్ ఆస్పత్రి పోస్టు మార్టం రిపోర్టులో ఆమెపై అత్యాచారమే జరగలేదని చెప్పడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ముప్పేట దాడితో యోగీ సర్కారులో కాస్త కదలిక వచ్చింది. ఈ ఘటనకు బాధ్యులుగా ఆరుగురు ఐఏఎస్ అధికారులపై యోగీ బదిలీ వేటు వేశారు. అదనపు ఛీఫ్ సెక్రటరీగా అవనీష్ కుమార్ అవస్ధీ స్ధానంలో నవనీత్ సెహగల్ను సీఎం యోగీ నియమించారు.
రంగంలోకి నిర్భయ న్యాయవాది సీమా కుష్వాహా..
ఢిల్లీలో నిర్భయ తరఫున వాదించి నిందితులకు ఉరిశిక్ష పడటంతో కీలక పాత్ర పోషించిన ఆమె న్యాయవాది సీమా కుహ్వాషా హత్రాస్ బాధితురాలి తరఫున వాదించాలని నిర్ణయించుకున్నారు. గతంలో నిర్భయ కేసులో ఆమె వాదనలు కేసులో చాలా కీలకంగా మారాయి. అప్పటి విజయంతో సీమా కుష్వాహాకు మంచి పేరు కూడా వచ్చింది. దీంతో ఆమెను హత్రాస్ బాధితురాలి తరఫున వాదింపజేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఫలించాయి. అయితే సీమాను హత్రాస్ వెళ్లనీయకుండా అక్కడి పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆమె ప్రస్తుతానికి బాధితురాలి కుటుంబ సభ్యులతో ఫోన్లోనే మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు. హత్రాస్లో వారిని కలవకుండా తాను వెనుదిరిగే ప్రశ్నే లేదని సీమా చెబుతున్నారు. దీంతో యోగీ సర్కారుపై ఒత్తిడి మరింత పెరుగుతోంది.
కుటుంబ సభ్యులకు బెదిరింపులు...
హత్రాస్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయకపోగా.. ఈ కేసును వెనక్కి తీసుకోవాలంటూ, యోగీ ప్రభుత్వానికి సహకరించాలంటూ కుటుంబ సభ్యులకు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఈ కేసులో బాధితురాలి కుటుంబ సభ్యులను ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు బెదిరిస్తుండగా.. తాజాగా హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లక్సార్ సైతం బెదిరిస్తున్న వీడియోను కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. ఇందులో జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ బాధితురాలి తండ్రిని ప్రభుత్వానికి సహకరించాలని బెదిరిస్తున్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఈ వ్యవహారం మరింత చిచ్చు రేపేలా కనిపిస్తోంది. గతంలో తమ ఎమ్మెల్యే కుల్దీప్ సింగార్ బాలికను రేప్ చేసి చంపిన విషయంలోనూ వెనకేసుకొచ్చిన బీజేపీ చివరికి ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించి తప్పించుకుంది. కానీ ఈసారి మాత్రం ఏకంగా మెజిస్టేట్ స్ధాయి వ్యక్తులతోనే బెదిరింపులకు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.