2024లో గెలుస్తారా ? మోడీకి నితీశ్ ప్రశ్న-ఎనిమిదో సారి బీహార్ సీఎంగా ప్రమాణం తర్వాత..
బీహార్లో జేడీయూను చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్న కారణంతో ఆ పార్టీని వీడి విపక్ష కాంగ్రెస్-ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీశ్ కుమార్... సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. మోడీని ఉద్దేశించి ఇవాళ నితీశ్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి.
బీహార్ ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత నితీశ్ కుమార్ .. ప్రధాని మోడీకి కీలక ప్రశ్న వేశారు. వచ్చే లోక్సభ ఎన్నికలపై స్పందిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ 2014లో గెలిచారు కానీ 2024లో అని ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేయాలని పదేపదే చెబుతున్నప్పటికీ..తాను ప్రధాని పదవికి ఆశించడం లేదని అన్నారు. 2014లో వచ్చిన వ్యక్తి 2024లో గెలుస్తారా అనేది మాత్రం అడగాల్సిన ప్రశ్నని నితీశ్ తెలిపారు. తద్వారా 2024లో తాను ప్రధానిగా రేసులో ఉన్నానన్న సంకేతాల్ని కూడా నితీశ్ ఇచ్చినట్లయింది.
Recommended Video
ప్రస్తుతానికి బీహార్ ముఖ్యమంత్రిగా మరోసారి పగ్గాలు చేపట్టిన నితీశ్ కుమార్.. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్ధి అవుతారనే అంచనాలు ఉన్నాయి. దీంతో ఆయన్ను ఇప్పటి నుంచే ఫోకస్ చేసేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. నితీశ్ కూడా భవిష్యత్ వ్యూహాలతో పాటు బీహార్లోనూ జేడీయూను చీల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు చెక్ పెట్టేందుకే తాజా వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో నితీశ్ కుమార్ నిర్ణయాలు ఇప్పుడు బీజేపీని చికాకు పెడుతున్నాయి.