ఆ సమయం ఆసన్నమైంది: అవిశ్వాసంపై మోదీ: గంట ఆలస్యంగా ఆరంభం
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవ్వాళ కూడా సభలో వాడివేడిగా చర్చ సాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు సభ్యులు దీనిపై మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యుడు రాహుల్ గాంధీ.. కేంద్రంపై చెలరేగారు.
ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై కిందటి నెల 26వ తేదీన ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై మంగళవారం సభలో చర్చ ఆరంభమైంది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్.. సహా ప్రతిపక్ష పార్టీల సభ్యులు దీనిపై మాట్లాడారు. ఎన్డీఏ పాలనలో దేశంలో సంభవిస్తోన్న పరిణామాలను ప్రస్తావించారు. మణిపూర్ అల్లర్లనూ సభ దృష్టికి తీసుకొచ్చారు.

ఈ తీర్మానంపై ప్రధాని మోదీ బదులు ఇస్తోన్నారు. ఈ సాయంత్రం సరిగ్గా 5:10 నిమిషాలకు మోదీ తన ప్రసంగాన్ని ఆరంభించారు. నిర్దేశిత సమయం కంటే గంటా 10 నిమిషాల పాటు ఆయన ప్రసంగం ఆలస్యంగా ఆరంభమైంది. నిజానికి- ఈ సాయంత్రం 4 గంటలకు మోదీ సభను ఉద్దేశించి అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించాల్సి ఉంది. దీనికి బదులుగా 5:10 నిమిషాలకు మోదీ ప్రసంగం మొదలైంది.
దేశ ప్రజలు తమ ప్రభుత్వంపై ఎంతో విశ్వాసం ఉంచారని, 2014లోనే కాకుండా.. ఆ తరువాతి ఎన్నికల్లోనూ సంపూర్ణ మెజారిటీతో తమను గెలిపించారని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు- తన వంతు వచ్చిందని అన్నారు. ప్రజలకు కృతజ్ఞతలను తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని, ఆ సమయం ఆసన్నమైందని చెప్పారు.












Click it and Unblock the Notifications