సునంద కేసులో ట్విస్టులు: ఉద్యోగానికి ఆ మహిళ రిజైన్
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో విచారణ కొనసాగుతోందని ఢిల్లీ పోలీసు చీఫ్ బిఎస్ బస్సీ వెల్లడించారు. శశి థరూర్ సహా పలువురు సాక్షుల నుంచి వాంగ్మూలం నమోదు చేసి ఐపిసి సెక్షన్ 174 కింద విచారణ చేస్తున్నట్టు సోమవారం న్యూఢిల్లీలో చెప్పారు.
సాక్షుల వాంగ్మూలం ప్రకారం చూస్తే విచారణ కొనసాగించడమొక్కటే మార్గమని ఆయన తెలిపారు. ఎఫ్ఐఆర్ దాఖలు చేసే అవకాశాలు ప్రస్తుతానికి లేవని కమిషనర్ సంకేతాలు ఇచ్చారు. కాగా, సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆదేశాల మేరక, సునందది హత్యనా లేక ఆత్మహత్యనా అన్నకోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఆమెది ఆక్మిక, అసహజ మరణమని శవపరీక్ష నివేదికలో తేలింది. మృతికి విషమే కారణమని వెల్లడించింది. నిర్దిష్ట ఆధారం కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ ఇచ్చిన నివేదికపై ఆధారపడుతున్నామని పోలీసులు తెలిపారు. అయితే అది అసమగ్రంగా ఉందని, ఎఫ్ఐఆర్ దాఖలుకు సరిపోదని పేర్కొన్నారు.
కాగా, సునంద మృతిని మొదట గుర్తించిన వ్యక్తి.. వ్యక్తిగత కారణాలతో తన ఉద్యోగాన్ని వదిలేశారట. సునంద ఓ హోటల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిని సదరు హోటల్ సిబ్బందిలో ఒకరు చూశారు. జనవరి 17న ఎలిజబెత్ అనే మహిళ డ్యూటీ చేశారు. సునంద మృతిని మొదట చూసిన ఆమె వెంటనే అలారం మోగించారు. ఈ కేసుకు సంబంధించి ఆమెను పోలీసులు విచారించారు. అయితే ఇప్పుడు ఆమె ఉద్యోగాన్ని వదిలి పెట్టడం గమనార్హం.












Click it and Unblock the Notifications