సత్వర న్యాయం అందకపోతే సుపరిపాలనకు అర్ధం లేనట్లే-యోగీ కామెంట్స్..
యూపీలో వరుసగా రెండోసారి అధికారం చేపట్టాక సుపరిపాలనపై ప్రత్యేకంగా దృష్టిపెడుతున్న సీఎం యోగీ ఆదిత్యనాథ్.. ఈ క్రమంలో శాంతి భద్రతలు, నేరాల అదుపుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజలకు సత్వర న్యాయం అందకపోతే సుపరిపాలనకు అర్ధం లేదని ఇవాళ సీఎం యోగీ వ్యాఖ్యానించారు. ఫోరెన్సిక్ విద్యాసంస్ధలతో యూపీ సర్కార్ ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా యోగీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు సకాలంలో న్యాయం జరగకపోతే, వారికి న్యాయం అందుబాటులో లేక స్థోమత లేకుంటే సుపరిపాలన, ప్రజాస్వామ్యం వంటి పదాలు అర్థరహితంగా మారుతాయని సీఎం యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. యూపీ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ఇనిస్టిట్యూట్లో మాట్లాడిన యోగీ.. ఇవాళ నేరాల స్వభావాన్ని అర్థం చేసుకుని, తదనుగుణంగా సిద్ధం కావడం చాలా ముఖ్యమన్నారు. సమాజంలో, సుపరిపాలన, ప్రజాస్వామ్యం వంటి పదాలకు అర్థం లేకుండా పోతుందని యోగీ తెలిపారు.

ప్రజలకు సకాలంలో న్యాయం అందకపోతే, అందుబాటులో లేకపోతే.. సాధారణ ప్రజలు రాజ్యాంగ సంస్థలు, పరిపాలనా వ్యవస్థపై నమ్మకం కోల్పోతే అలాంటి పదాలకు అర్థం ఉండదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూపీ స్టేట్ ఫోరెన్సిక్ సైన్స్ ఇన్స్టిట్యూట్ని స్థాపించిందని, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు అగ్రశ్రేణి ఫోరెన్సిక్ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. నేరాల స్వభావాన్ని, సమాజం ఏం డిమాండ్ చేస్తుందో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఫోరెన్సిక్ విద్యార్ధులకు ఆయన సూచించారు.
ఐదు కోర్సులతో ఇవాళ ఫోరెన్సిక్ ఇన్ స్టిట్యూట్ మొదటి బ్యాచ్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని యోగీ ఆదిత్యనాథ్ తెలిపారు. హోం శాఖతో పాటు, ఫోరెన్సిస్ సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తులు దీనిని ప్రపంచ స్థాయి సంస్థగా తీర్చిదిద్దాలని యోగీ సూచించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఫోరెన్సిక్ సంస్థలోని ఉపాధ్యాయులు, విద్యార్దులను పరిచయం చేసుకున్నారు. కొత్త తరం కోర్సులను ఇందులో ప్రవేశపెడతామని, ఇన్స్టిట్యూట్లో అత్యుత్తమ అధ్యాపకుల ఎంపిక జరిగేలా చూస్తామని యోగీ హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications