కరీనా లవ్ జిహాదీ కాదు, ఇంకా హిందువే: సైఫ్ అలీ ఖాన్
ముంబై: తనను పెళ్లి చేసుకున్న తర్వాత కరీనా కపూర్ మతం మార్చుకుందనే ప్రచారానికి బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ తెరదించారు. కరీనా కపూర్ ఇప్పటికీ హిందువేనని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. ఆమె మతం మార్చుకొందని చాలా మంది చెబుతున్నారని, కానీ.. అది నిజం కాదని ఆయన అన్నారు. కరీనా ఫొటోపై లవ్ జిహాదీ అని ముద్రించి కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన గుర్తు చేస్తూ ఆమె ఇంకా హిందువేనని అన్నారు.
కరీనా కపూర్ లవ్ జిహాదీ అంటూ కొంత మంది చేసే వ్యాఖ్యలతో తమ సంబంధం ఏ మాత్రమూ చెడదని ఆయన అన్నారు. అయితే, ఇలా మాట్లాడేవారు విజ్ఞతతో వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు. అంతేకాదు, కరీనా మహిళా హక్కుల అమలు కోసం కృషి చేస్తుందని చెబుతూ దాని గురించి మాత్రం ఏ ఒక్కరూ మాట్లాడరని అన్నారు.
కరీనా కపూర్ లవ్ జిహాదీ అంటూ చేసే వ్యాక్యలు ఉద్వేగంగా, బౌద్ధికంగా, సామాజికంగా తమ జీవితంలోకి రాబోవని ఆయన అన్నారు. వాటిని తీవ్రంగా పట్టించుకోవడానికి ముందు వ్యక్తిత్వం, తెలివి, బుద్ధి పనిచేస్తాయని ఆయన అన్నారు.
విశ్వహిందూ పరిషత్కు (వీహెచ్పీ) చెందిన ఓ మేగజిన్ కవర్ పేజీ పైన బాలీవుడ్ నటి కరీనా కపూర్ మార్ఫింగ్ ఇమేజ్ కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. లవ్ జిహాద్, మత మార్పిళ్ల పైన వీహెచ్పీ నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో అది చోటు చేసుకుంది. తాజాగా తమ మేగజిన్ అయిన 'హిమాలయ వాహిని' కవర్ పేజీ పైన కరీనా ఫోటోను మార్ఫింగ్ చేసి వేసినట్లుగా చెబుతున్నారు.
అందులో సగం ముఖం పైన ముసుగు కప్పి ఉంది. లవ్ జిహాద్, ముస్లీం వ్యక్తిని పెళ్లి చేసుకున్న హిందూ మహిళలను తిరిగి మతం మార్చడం వంటి సమస్యల పరిష్కారం అని ఫోటో కింద పేర్కొంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ను కరీనా వివాహం చేసుకుంది. ఆమె ఓ సెలబ్రిటీ.