Madhya Pradesh: రక్తస్రావంతో 2 గంటల పాటు, 8 కిలోమీటర్లు.. అత్యాచార బాధితురాలి నరకయాతన..
మాయమైపోతున్నడమ్మ మనిషన్న వాడు.. మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు.. అని ఓ కవి రాసిన పదాలు ఇప్పుడు నిజమవుతున్నాయి. ఓ బాలిక అత్యాచారానికి గురై గాయాలతో.. రోడ్డుపై 8 కిలోమీటర్లు తిరుగుతూ సాయం కోరింది. కానీ ఆమెను చూడడానికి ఎగబడిన జనం.. ఆమెకు రక్షణ కల్పించాలని మాత్రం అనుకోలేదు. పైగా ఆ బాలికను వీడియోలు తీశారు. ఈ మానవత్వం మంటగలిసిన ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.
మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా మహాకాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 12 ఏళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంట్లోనే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఒంటిపై దుస్తులు చింపి పడేశారు. రాక్షసుల నుంచి తప్పించుకున్న బాలిక అర్థ నగ్నంగానే సాయం కోసం రోడ్డు వెంట పరుగులు పెట్టింది. రోడ్డు మీద ఆ బాలిక పరుగెడుతుంటే చాలా మంది చూశారు కానీ ఆమె సాయం చేయడానికి ముందుకు రాలేదు. బాలిక 2 గంటలపాటు ఎనిమిది కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ వెళ్లినా ఎవరూ పట్టించుకోలేదు.

వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ బాలిక చివరికి ఉజ్జయినిలోని బద్ నగర్ ఏరియాలోని ఓ ఆశ్రమం దగ్గరకు వెళ్లింది. అక్కడే ఆశ్రమ పూజారి.. బాలిక పరిస్థితి చూసి చలించిపోయి ఆమెకు దుస్తులు ఇచ్చి సాయం చేశాడు. ఆ తర్వాత పూజారి పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనాస్థిలికి చేరుకున్న పోలీసులు బాలికను ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స చేయిస్తున్నారు. నిందితులను పట్టుకోవటానికి ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఘటనపై ఉజ్జయిని ఎస్పీ తెలిపారు.
పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. బాలిక నుంచి వివరాలు సేకరిస్తున్నామని.. బాలిక తల్లిపైనా దాడి జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. బాలిక తన తల్లితో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ నుంచి వచ్చినట్లు పేర్కొన్నారు. బాలిక పట్ల స్థానికుల ప్రవర్తించిన తీరు పట్ల ఎస్పీ విస్మయం వ్యక్తం చేశారు. రక్తస్రావం, అర్థనగ్నంగా ఓ బాలిక రోడ్డు సాయం కోసం అర్థిస్తున్న పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కనీసం పోలీసులకైనా సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications