కొవిషీల్డ్ తీసుకుంటే రక్త గడ్డ కట్టదు -కేంద్రం క్లారిటీ -కొత్త వేరియంట్లపైనా 2టీకాల ఎఫెక్ట్
ప్రఖ్యాత బ్రిటిష్-స్విడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్ పై యూరప్ దేశాల్లో భయాందోళనలు ఇంకా తగ్గలేదు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టుకుపోతున్నదని, ఆస్ట్రియాలో ఓ నర్సు ఈ లక్షణాలతోనే మరణించిందని తెలియడంతో ఆయా దేశాలు తాత్కాలికంగా వ్యాక్సిన్ పంపిణీని నిలిపేశాయి. నిపుణులు అభయమిచ్చిన తర్వాత కొన్ని దేశాలు తిరిగి వ్యాక్సిన్ పంపిణీని పున: ప్రారంభించాయి. అయితే భారత్ కు సంబంధించి..

ఎట్టకేలకు వివరణ..
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ యూరప్ దేశాల్లో నిలిపివేతకు గురికాగా, ఆ రెండూ భారత్ లోని సీరం ఇనిస్టిట్యూట్ తో కలిసి రూపొందించిన 'కొవిషీల్డ్' వాడకంపైనా అనుమానాలు తలెత్తాయి. మనదేశంలో కొవిషీల్డ్ తోపాటు భారత్ బయోటెక్ వారి కొవాగ్జిన్ టీకాలను విస్తతంగా పంపిణీ చేస్తుండటం తెలిసిందే. యూరప్ లో, భారత్ లో ఆస్ట్రాజెనెకా ఫార్ములా దాదాపు ఒకటే కావడంతో మన దగ్గరా రక్తం గడ్డ కట్టుకుపోతుందేమోననే భయాలు వ్యాపించాయి. దీనిపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ వ్యవహారంపై కేంద్రం ఎట్టకేలకు వివరణ ఇచ్చింది..

ఆ టీకాతో రక్తం గడ్డకట్టదు
కొవిషీల్డ్ (ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్) టీకా సురక్షితమైందని, దానితో వ్యాక్సినేషన్ కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆ టీకా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భారత్లో ఆ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు తలెత్తలేదని జాతీయ స్థాయి ఏఈఎ్ఫఐ నిపుణుల కమిటీ తేల్చిందని నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్య విభాగం) డాక్టర్ వి.కె.పాల్ వెల్లడించారు. అంతేకాదు..

కొత్త స్ట్రెయిన్స్పైనా పనిచేస్తాయి
ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ఫర్డ్-సీరం వారి కొవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల భారత్ లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదని నీతిఆయోగ్ సభ్యుడు పాల్ స్పష్టం చేయగా, సదరు కొవిషీల్డ్ తోపాటు కొవాగ్జిన్ టీకా సైతం కొత్త వేరియంట్లపైనా సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు ఐసీఎంఆర్ తెలిపారు. ''బ్రిటన్, బ్రెజిల్ స్ట్రెయిన్లపైనా కొవిషీల్డ్, కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి'' అని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ పేర్కొన్నారు. గురువారం నాటికి మన దేశంలో మొత్తం 5,31,45,709మందికి టీకాలను అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications