కేంద్రం వర్సెస్ సోషల్ మీడియా పోరు- యూజర్ల పేరుతోనే ఇద్దరి పోరు-నష్టపోయేదీ వారే
భారత్లో సోషల్ మీడియా సంస్ధలపై నియంత్రణ కోసం తీసుకొచ్చిన కొత్త ఐటీ నిబంధనలు యూజర్ల ప్రయోజనాలన కాపాడేందుకే అని కేంద్రం చెప్తుండగా.. అటు సోషల్ మీడియా సంస్ధలు సైతం తమ యూజర్ల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నట్లు చెప్తున్నాయి. దీంతో వీరి పోరాటం యూజర్ల కోసమా లేక స్వప్రయోజనాల కోసమా అన్న చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. యూజర్ల ప్రయోజనాల కోసమే అయితే వారి అభిప్రాయాలు తీసుకుని, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకునే అవకాశమున్నా దాన్ని కాదని మొండిగా పోరాటానికే సిద్ధపడటం విమర్శలకు తావిస్తోంది.

కేంద్రం వర్సెస్ సోషల్ దిగ్గజాలు
దేశంలో తమకు అనుకూలంగా పనిచేయడం లేదనే భావనతో అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజాలైన ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సంస్ధలను నియంత్రించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. అదే సమయంలో ఆయా సంస్ధలు భారత్లో పనిచేస్తున్నప్పుడు ఇక్కడి నిబంధనలకు అనుగుణంగా పనిచేయాల్సిందేననే వాదన పెరుగుతోంది. దీంతో అసలు వీరిద్దరి పోరాటం ఎవరి కోసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కేంద్రంపై న్యాయపోరాటం
కేంద్రం తీసుకొచ్చిన కొ్త్త ఐటీ రూల్స్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా సంస్ధలు కోర్టుల్ని ఆశ్రయిస్తున్నాయి. భారత్లో చట్టాలకు అనుగుణంగా తాము పనిచేస్తున్నా కేంద్రం తమను నిబంధనల పేరుతో ఇబ్బందులు పెడుతోందని అవి ఆరోపిస్తున్నాయి. తమ యూజర్ల గోప్యతను కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందంటున్నాయి. కానీ కేంద్రం మాత్రం తాము కోరిన ప్రతీ సమాచారం ఇవ్వాలని కోరుతోంది. దీంతో ఇప్పుడు దీనిపై కోర్టులు ఎలాంటి తీర్పు ఇస్తాయన్న ఉత్కంఠ పెరుగుతోంది.

యూజర్ల ప్రయోజనాలా ? తమ ప్రయోజనాలా
కేంద్రం కొత్త ఐటీ నిబంధనల్ని అమల్లోకి తెస్తున్న నేపథ్యంలో యూజర్ల ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నట్లు చెబుతోంది. కానీ ఐటీ చట్టంలో చేసిన మార్పుల్ని గమనిస్తే మాత్రం యూజర్ల ప్రయోజాల కంటే తమ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అర్దమమవుతోంది. ఎందుకంటే యూజర్ల ప్రయోజనాల కోసమే అయితే అదే యూజర్లను ఇన్నేళ్లుగా కాపాడుకుంటున్న సోషల్ మీడియా సంస్ధల్ని ఇబ్బందిపెట్టడం ఎందుకన్న చర్చ సాగుతోంది. దీంతో ఈ వ్యవహారంలో కేంద్రం దోషిగా నిలబడుతోంది.

యూజర్లే బలి పశువులు
కేంద్రం, సోషల్ మీడియా సంస్ధల మధ్య సాగుతున్న ఈ టగ్ ఆఫ్ వార్లో అంతిమంగా నష్టపోయేది యూజర్లే అన్నవాదన వినిపిస్తోంది. ఎందుకంటే కేంద్రం చెప్పినట్లు యూజర్ల గోప్యతను బయటపెట్టడం మొదలుపెడితే యూజర్లకు ఇబ్బందులు తప్పవు. అప్పుడు వారు ఇప్పటివరకూ వాడుతున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు గుడ్బై చెప్పడం తప్ప మరో ఛాయిస్ ఉండదు. అదే సమయంలో ఒక ప్లాట్ఫామ్ను కాదని మరో ప్లాట్ఫామ్కు వెళ్లినా ఇదే సమస్య ఎదురవుతున్నప్పుడు యూజర్ల గోప్యత ప్రమాదంలో పడుతుంది. మరి ఇలాంటి పరిస్ధితిని కేంద్రం స్వాగతిస్తుందా అంటే అవునని చెప్పలేని పరిస్దితి. అటువంటప్పుడు ఈ ఇగోలు ఎందుకన్నదే అసలు ప్రశ్న.












Click it and Unblock the Notifications