సత్తా చాటాం, ఒక్క దేశం మాట్లాడలేదు: అమెరికాలో మోడీ
భారత్ తనను తాను కాపాడుకోడానికి ఎంతటి కఠిన చర్యలైనా చేపట్టేందుకు వెనుకాడబోదని, అందుకు సర్జికల్ స్ట్రైక్స్ ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
వాషింగ్టన్: భారత్ తనను తాను కాపాడుకోడానికి ఎంతటి కఠిన చర్యలైనా చేపట్టేందుకు వెనుకాడబోదని, అందుకు సర్జికల్ స్ట్రైక్స్ ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని వర్జీనియాలోని భారత-అమెరికన్ల విందులో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన సర్జికల్ దాడుల గురించి ప్రస్తావించారు. ఉగ్రవాదులు, వారి చర్యల వల్ల భారత ప్రజల శాంతిభద్రతలకు భంగం కలుగుతోందని, వాటిని అడ్డుకునేందుకే సర్జికల్ దాడులు చేపట్టామని, అయితే భారత చర్యను ప్రపంచ దేశాలు కూడా సమ్మతించాయని, అందుకే ఏ దేశమూ సర్జికల్ దాడుల గురించి ప్రశ్నించలేదని అన్నారు.

ఇరవై ఏళ్ల క్రితం తాము ఉగ్రవాదం గురించి చెప్పినప్పుడు కొంతమంది అది చట్టం, శాంతి భద్రతల సమస్య అన్నారని, దాని తీవ్రతను అర్థం చేసుకోలేదని, కానీ ఇప్పుడు ఉగ్రవాదం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్లకు టెర్రరిస్టులే చెబుతున్నారని అన్నారు.
ఎప్పుడూ నిగ్రహంగా ఉండే భారత్ తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాల్సి వచ్చినప్పుడు, తమ ప్రజలకు భద్రత కల్పించాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎంతటి చర్యలనైనా చేపట్టేందుకు సంకోచించదని సర్జికల్ దాడుల ద్వారా తేల్చి చెప్పామన్నారు.
అదే సమయంలో అంతర్జాతీయ చట్టాలకు భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, వసుధైక కుటుంబమే తమ ఆకాంక్ష అన్నారు. మోడీ ప్రసంగం అనంతరం భారత అమెరికన్ల కరతాళ ధ్వనులతో సభాప్రాంగణం మార్మోగిపోయింది.
గతేడాది సెప్టెంబర్ 29న భారత సైన్యం సర్జికల్ దాడులను చేపట్టిన విషయం తెలిసిందే. నియంత్రణ రేఖ వెంబడి పాక్ భూభాగంలోని ఉగ్రస్థావరాలపై జవాన్లు లక్షిత దాడులు చేశారు.












Click it and Unblock the Notifications