Mamata Banerjee: అసెంబ్లీకి మమత ? ఉప ఎన్నికలకు ముహుర్తం ఫిక్స్..!
పశ్చిమబెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు వేగంగా మారిపోయాయి. అప్పటివరకూ ఎంతో పటిష్టంగా కనిపించిన తృణమూల్ కాంగ్రెస్ .. ఒక్క ఓటమితో పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఈ ఓటమి తర్వాత టీఎంసీ నుంచి బీజేపీకి సాగిన భారీ ఫిరాయింపులే. ఎంపీలు, ఎమ్మెల్యేలు అన్న తేడా లేకుండా టీఎంసీని వీడటం ప్రారంభించారు. దీంతో సుదీర్ఘకాలం బెంగాల్ సీఎంగా కొనసాగిన మమతా బెనర్జీ (Mamata Banerjee).. ఇప్పుడు సొంత పార్టీ టీఎంసీని కాపాడుకోవడానికి శ్రమించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో మమతా బెనర్జీకి ఓ అద్భుతమైన అవకాశం లభిస్తోంది.
బెంగాల్లోని నందిగ్రామ్, రెజీనగర్ స్ధానాలకు వచ్చే నెల 6వ తేదీన ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. వీటిలో నందిగ్రామ్ స్ధానం సీఎం సువేందు అధికారి ఖాళీ చేసిందే. అలాగే గతంలో మమతా బెనర్జీ పలుమార్లు గెలిచిన నియోజకవర్గమే. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ లో మమతను ఓడించిన సువేందు అధికారి.. ఈసారి ఆమె పోటీ చేసిన భవానీపూర్ లోనూ ఓడించి సంచలనం సృష్టించారు. అయితే ఈసారి నందిగ్రామ్, భవానీపూర్ రెండు సీట్ల నుంచీ పోటీ చేసి గెలిచిన సువేందు.. భవానీపూర్ లో కొనసాగుతూ నందిగ్రామ్ సీటుకు రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉపఎన్నిక జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నందిగ్రామ్ ఉపఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీకి వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇప్పటికే అసెంబ్లీలో టీఎంసీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేల్లో 50 మందికి పైగా బీజేపీ మద్దతుతో వేరు కుంపటి పెట్టుకోవడమే కాకుండా విపక్ష హోదా కూడా పొందారు. ఇప్పుడు మమతా బెనర్జీ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి అసెంబ్లీలో అడుగుపెడితే ఈ లెక్కలు మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దీంతో మమత నందిగ్రామ్ బరిలోకి దిగే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అక్టోబర్ 6న జరిగే ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఫలితాలు అక్టోబర్ 9న ఉంటాయి.














Click it and Unblock the Notifications
