మహిళపై ఎమ్మెల్యే అత్యాచారం: కేసు నమోదు
ఉదాల పట్టణంలోని స్థానిక మహిళ తనకు ఉద్యోగం కావాలంటూ.. అధికార పార్టీకి చెందిన బీజు జనతాదళ్ ఎమ్మెల్యే శ్రీనాథ్ సోరెన్ను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆయన కోరిన విధంగా ముందుగా రూ. లక్ష రూపాయలను అందజేసింది. అయితే ఉద్యోగం కోసం ఎమ్మెల్యే వద్దకు ఎన్ని సార్లు వెళ్లినా మరోసారి రమ్మని ఆయన చెప్పడంతో సదరు మహిళ విసిగిపోయింది.
ఈ నేపథ్యంలో తాను ఇచ్చిన నగదు మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆ మహిళ.. ఎమ్మెల్యేను డిమాండ్ చేసింది. దీంతో జనవరి 3న తప్పక ఇస్తానని, తాను చెప్పిన చోటుకు రమ్మన్నాడు. ఆ మాటలు నమ్మిన మహిళ.. ఎమ్మెల్యే చెప్పిన చోటుకు వెళ్లింది. అక్కడికి వచ్చిన మహిళపై ఎమ్మెల్యేతోపాటు అతడి సహాయకుడు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అయితే వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదును స్వీకరించిన కోర్టు.. సదరు ఎమ్మెల్యే, అతడి సహాయకుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో నిందితులపై సోమవారం సాయంత్రం పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రతిపక్షాల కుట్రలో భాగంగానే ఆ మహిళ తనపై ఆరోపణలు చేస్తోందని శ్రీనాథ్ సోరెన్ ఆరోపించారు.