ఎవరూ ముందుకు రాలేదు: బిచ్చగత్తెకు అంత్యక్రియలు నిర్వహించిన ఎమ్మెల్యే
భువనేశ్వర్: ఓ ఎమ్మెల్యే మానవత్వాన్ని చాటుకున్నారు. అనాథ శవంగా మారిన బిచ్చగత్తెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన ఒడిశాలో జరిగింది. ఝర్సుగూడలోని ఆమనపాలి గ్రామంలో 80 ఏళ్ల బిచ్చగత్తె అనారోగ్యంతో మృతి చెందింది. విషయాన్ని స్థానికులు గమనించలేదు. ఆ తర్వాత తెలిసినా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.
ఈ విషయం స్థానిక పోలీసులకు, స్థానిక ఎమ్మెల్యే రమేష్ పత్వాకు (బీజేడీ) చేరింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తన కార్యక్రమాలు రద్దు చేసుకున్నారు. తన కుమారుడు అంకిత్, అల్లుడు బాదల్ను పిలిచి ఆ గ్రామానికి అంత్యక్రియల కోసం రావాలని సూచించాడు. ఆ తర్వాత ఎమ్మెల్యే రమేష్, తన స్నేహితుడు భరత్ కరాలీతో కలిసి సంఘటన ప్రాంతానికి చేరుకున్నారు.
వృద్దురాలి అంత్యక్రియలను సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. పాడెను స్మశానం వరకు మోసుకెళ్లారు. దుస్తులు మార్చుకుని, టీషర్టు ధరించి టవల్ నడుముకు చుట్టుకుని మహిళ మృతదేహాన్ని స్ట్రెచర్పై మోసుకెళ్లారు. అనంతరం ఆయనే ఆ శవానికి అంత్యక్రియలు చేశారు. అనాథ మహిళ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించినందుకు ఎమ్మెల్యేపై ప్రశంసలు కురుస్తున్నాయి.
అంత్యక్రియల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదని తెలిసి బాధ కలిగిందన్నారు. చనిపోయిన యాచకురాలు తనకు తెలుసునని, చాలా ఏళ్ల నుంచి ఆమె ఇక్కడే యాచన చేస్తుందన్నారు. యాచకురాలి అంత్యక్రియలు జరిపించాలని గ్రామస్తులను తాను కోరానని, కానీ ఎవరూ ముందుకు రాలేదని చెప్పారు. దీంతో తానే స్వయంగా అంత్యక్రియలు జరపాలన్నారు. దీనినిప్రజలకు తాను చేసే సేవగా భావిస్తానని అన్నారు.