సినిమాలాగే: 20ఏళ్ల తర్వాత తన సోదరుడ్ని కలిశాడు
న్యూఢిల్లీ: సినిమాను తలపించేలా దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘటన చోటు చేసుకుంది. సుమారు 20ఏళ్ల తర్వాత ఇద్దరు సోదరులు ఫేస్బుక్ అధికారుల సాయంతో కలుసుకోగలిగారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లైబ్రరీలో పనిచేస్తున్న విజయ్ నిత్నావరే(48) ఇరవైఏళ్ల క్రితం ఇంట్లోనుంచి వెళ్లిపోయిన తన తమ్ముడు హన్స్రాజ్ కోసం తీవ్రంగా వెతికి ఎట్టకేలకు వారం క్రితం అతన్ని కలుసుకున్నాడు.
పదోతరగతి ఫెయిల్ అవటంతో మహారాష్ట్రలోని వార్ధాకు చెందిన హన్స్రాజ్ 1995లో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. అప్పుడు కుటుంబమంతా తీవ్రంగా వెతికినా ఫలితం లేకపోయింది.

ఆ తర్వాత ఉద్యోగాన్వేషణలో అతని సోదరుడు విజయ్ ఢిల్లీవచ్చి పీఐబీలో ఉద్యోగంలో కుదరుకున్నారు. కానీ, తమ్ముడి కోసం వీలైనన్ని మార్గాల్లో అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో నిరుడు తన తమ్ముడిని వెతికివ్వమని ఫేస్బుక్ కార్యాలయాన్ని సంప్రదించారు.
కాగా, వారు సేకరించిన ఆధారాల ప్రకారం మహారాష్ట్రలోని పుణెలో టయోటా కంపెనీలో హన్స్రాజ్ పనిచేస్తున్నట్లు తెలిసింది. దీంతో వెంటనే వెళ్లి అతడ్ని కలిశాడు. సుమారు 20 ఏళ్ల తర్వాత తమ్ముడిని కలిపినందుకు ఫేస్బుక్కు విజయ్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంటి నుంచి వెళ్లిన తర్వాత తాను గుజరాత్ వెళ్లిపోయానని, ఆ తర్వాత ఓ రోజు బావిలో దూకి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోదరుడు విజయ్కి చెప్పాడు హన్స్రాజ్. అయితే, బావిలో దూకిన తనను అక్కడి స్థానికులు కాపాడారని తెలిపాడు. ఆ తర్వాత ఐదేళ్లపాటు వారి సాయంతో అక్కడే జీవించినట్లు తెలిపాడు.
అనంతరం ముంబైకి చేరుకుని మహీంద్రా కంపెనీ షోరూంలో చేరినట్లు చెప్పాడు. అక్కడే ఓ అమ్మాయితో ప్రేమలో పడి వారి పెద్దలు అంగీకరించకపోయినప్పటికీ ఆమెను వివాహం చేసుకున్నట్లు హన్స్రాజ్ తెలిపాడు. ముంబై పోలీస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వద్ద డ్రైవర్గా కూడా విధులు నిర్వహించినట్లు తెలిపాడు. కాగా, 20ఏళ్ల తర్వాత కలిసిన తన సోదరుడు హన్స్రాజ్, అతని ఫ్యామిలీని ఆనందంతో ఢిల్లీకి తీసుకెళ్లాడు విజయ్.












Click it and Unblock the Notifications