శుభవార్త: పెట్రోల్,డీజీల్పై ఎక్సైజ్ సుంకం తగ్గించాలి: ఇంధన శాఖ
న్యూఢిల్లీ: పెరుగుతున్న పెట్రోలియం ఉత్పత్తుల ధరలను నియంత్రించేందుకు ఇంధన మంత్రిత్వశాఖ చర్యలు ప్రారంభించింది. పెట్రోలియం ఉత్పత్తులపై ఉన్న ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖను కోరింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తోడు పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్లతో వినియోగదారులపై భారం మరింత పెరుగుతోంది.
కొంతకాలంగా పెట్రోలియం ఉత్పత్తులను కూడ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలనే డిమాండ్ కూడ వస్తోంది. అయితే ఈ డిమాండ్పై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు కేంద్రం కొన్ని ట్యాక్స్లను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ ట్యాక్స్ను తగ్గించాలి
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని ఇంధన శాఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను కోరింది ఇటీవల కాలంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ఎక్సైజం సుంకాన్ని తగ్గిస్తే ప్రయోజనమని ఇంధన శాఖ భావిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు విన్నవించింది. త్వరలోనే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టనుంది. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ ముందు ఇంధన శాఖ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చింది.

ఎక్సైజ్ సుంకం ఎంత తగ్గిస్తారో చెప్పలేదు
ఎక్సైజ్ సుంకం ఎంత మేరకు తగ్గించాలనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆర్థిక మంత్రి సన్నద్దమౌతున్నారు. ఈ తరుణంలో ఇంధన శాఖ నుండి ఈ ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఆర్థిక శాఖ ఏ రకమైన నిర్ణయం తీసుకొంటుందనే విషయం మాత్రం బడ్జెట్ తర్వాతే తేలనుంది.

పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకం రూ. 19.48
ప్రస్తుతం లీటర్ పెట్రోల్పై రూ.19.48, డీజీల్ పై రూ.15.33 ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తున్నారు. దీనికి తోడు ఆయా రాష్ట్రాల్లో వ్యాట్ ట్యాక్స్ అదనంగా ఉంటుంది.ఈ కారణంగానే వినియోగదారుడిపై భారం పడుతోంది. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్స్ ల కారణంగానే వినియోగదారుడు ఇంధనం కోసం అధికంగా చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్టీయే హయంలో 9 సార్లు ఎక్సైజ్ సుంకం పెంపు
2014 నుండి 2016 వరకు తొమ్మిది సార్లు ఎక్సైజ్ సుంకాన్ని ఎన్డీయే ప్రభుత్వం పెంచింది. ఆ సమయంలో అంతర్జాతీయంగా ముడి చమురు దరలు తక్కువగా ఉన్నప్పటికీ ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాల ట్యాక్స్ లతో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు మాత్రం తగ్గలేదు గత ఏడాది అక్టోబర్ లో రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గించింది.












Click it and Unblock the Notifications