Fake Alert : ఆ వైరల్ వీడియో భారత్లో జరిగింది కాదు..
కరోనా వైరస్ ఎంతలా విజృంభిస్తుందో సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ కూడా అంతే స్థాయిలో హల్చల్ చేస్తున్నాయి. లెక్కకు మించి నిరాధార కథనాలు పుట్టుకొస్తున్నాయి. ముఖ్యంగా ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కొన్ని దుష్ప్రచారాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటిదే ఓ వీడియో పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతోంది.
ఐసోలేషన్ వార్డులో జమాత్ సభ్యులు నగ్నంగా తిరుగుతున్నారంటూ హిందుస్తాన్ ఆవాజ్లైవ్ ఫేస్బుక్ పేజీలో ఓ వీడియోను పోస్టు చేశారు. 'చూడండి.. 14 రోజుల ఐసోలేషన్లో ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారో.. ఎంత గందరగోళం చేస్తున్నారో.. అన్ని హద్దులను దాటేసి దారుణంగా వ్యవహరిస్తున్నారు. వీళ్ల తీరుపై ప్రభుత్వం విచారం వ్యక్తం చేస్తోంది.' అని ఆ వీడియోకి కామెంట్ను జతచేశారు. కొద్ది నిమిషాల్లోనే ఈ వీడియో 1400 సార్లు షేర్ అయింది.
కానీ ఈ వీడియోలో పేర్కొన్నట్టు.. అది జమాత్ సభ్యులకు సంబంధించింది కాదు. భారత్కు సంబంధించింది అంతకన్నా కాదు. అది పాకిస్తాన్కు చెందిన ఓ పాత వీడియో. అగస్టు 26,2019న పాకిస్తాన్ సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ అయింది. 'కరాచీలోని గుల్షన్ ఈ హదీద్ మసీదులోకి నగ్నంగా ప్రవేశించిన వ్యక్తి' అని దానికి టైటిల్ పెట్టారు. గూగుల్లో ఆ మసీదు వివరాలను వెతికితే.. ఆ వీడియోలో ఉన్న మసీదే కనిపిస్తోంది. మసీదులో అద్దాలు పగలగొట్టి అరాచకం సృష్టించిన ఆ వ్యక్తిని మతిస్థిమితం లేనివాడిగా గుర్తించి పాకిస్తాన్ పోలీసులు అరెస్ట్ కూడా చేసినట్టు చెబుతున్నారు.
అయితే ఇదంతా భారత్లో తబ్లిఘీ జమాత్ సభ్యుల నిర్వాకం అంటూ కొంతమంది సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. నిజాముద్దీన్ మర్కజ్ తర్వాత కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడంతో.. వారిపై కొన్ని ఫేక్ న్యూస్ కూడా పుట్టుకొస్తున్నాయి. ఇది కూడా ఆ కోవలోనిదే. ఇదే తరహాలో ఇటీవల రెండు జాతీయ పత్రికలు.. ఐసోలేషన్ వార్డులో తబ్లిఘీ జమాత్ సభ్యులు మాంసాహారం డిమాండ్ చేశారని.. ఇవ్వనందుకు బహిరంగ మలవిసర్జన చేశారని కథనాలు ప్రచురించాయి. అయితే ఉత్తరప్రదేశ్ సహరన్పూర్ పోలీసులు అవి నిరాధార ఆరోపణలని కొట్టిపారేశారు.
No, Tablighi Jamat members are not wandering around naked in an isolation ward in hospital, it’s a fake video video from Pakistan https://t.co/L4zb4HYnon via @AltNews
— Sagarika Ghose (@sagarikaghose) April 8, 2020