మోడీకి సభకు విశేష స్పందన: ఒమర్ ప్రశంసలు
లండన్: అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ను మరిపించే రీతిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం సాయంత్రం లండన్లోని చారిత్రక వెంబ్లీ స్టేడియంలో ప్రవాస భారతీయులు ఉద్దేశించి ఉత్కంఠభరిత రీతిలో ప్రసంగించారు. ఆయన సభకు ప్రవాసుల నుంచి విశేష స్పందన వచ్చింది. సుమారు 60వేల మంది ప్రవాసులు ఈ సభకు హాజరై హర్షద్వానాలతో స్వాగతం పలికారు.
భారత దేశ యువశక్తి గురించి, దేశ సంప్రదాయాల గురించి, బ్రిటన్తో ఉన్న ఉన్నత సంప్రదాయాల గురించి ఉద్విగ్నభరిత రీతిలో మాట్లాడారు. మోడీ..మోడీ అన్న నినాదాలు మధ్య నరేంద్ర మోడీ ప్రసంగం అప్రతిహతంగా సాగింది. యువశక్తి అపారంగా ఉన్న భారత దేశం వెనకబడి పోవడానికి పేదరికంలో మగ్గిపోవడానికి ఎంత మాత్రం ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
ఉగ్రవాదం, తీవ్రవాదం ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లని మోడీ తెలిపారు. భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ ఔన్నత్యాన్ని చాటుకుంటారని, తమ సంప్రదాయాలను పరిరక్షించుకుంటేనే ఆయా దేశాల ప్రజల్లో మమేకం అయపోతారంటూ మోడీ అభినందన పూర్వకంగా పేర్కొన్నారు. దాదాపు 60వేల మందితో వెంబ్లీ స్టేడియం కిక్కిరిసిపోయింది. బ్రిటన్ ప్రధాని కామెరాన్ను భారత్ దేశానికి మిత్రుడిగా అభివర్ణించారు.
బ్రిటన్లో ఉంటున్న భారతీయుల గురించి వారి అంకిత భావం గురించి అనేక సందర్భాల్లో కామెరాన్ ప్రశంసాపూర్వకంగా చెప్పారని మోడీ వెల్లడించారు. బ్రిటన్లో తనకు లభించిన స్వాగతం మాతృదేశాన్నే మరిపించిందని పేర్కొన్నారు. ప్రపంచంలో రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల ప్రధాన మంత్రులు కలుసుకోవడం అన్నది ఓ చారిత్రక సందర్భమని మోడీ పేర్కొన్నారు.
భారత్-బ్రిటన్ల మధ్య పెనవేసుకుంటున్న బంధానికి, ఇక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులు, భారత సంతతికి చెందిన ప్రజలు నిజమైన వారధి అని ఆయన వెల్లడించారు. ప్రపంచ శాంతి పరిరక్షణకు భారత దేశం తన పాత్రను గురుతర రీతిలో పోషిస్తోందని, భవిష్యత్లో కూడా ఇదే తరహాలో ముందుకు వెళ్తుందని ప్రధాని తెలిపారు.

భిన్నదృక్పదాలు కలిగిన భారత్-బ్రిటన్లు అనేక రంగాల్లో ఏకం కావడం అనేక మందిని ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. భారత దేశం భిన్నత్వానికి ప్రతీక అని ఆ భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉండడమే తమ దేశ నిజమైన శక్తి అని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. ప్రపంచలో ఏ దేశానికి లేనంత యువశక్తి కలిగిన భారత్ ఎంతమాత్రమూ వెనకబడి ఉండడానికి వీలులేదని అన్నారు.
12 ఏళ్ల క్రితం తాను లండన్కు వచ్చిన విషయాన్ని గుర్తుచేసుకున్న ఆయన తాజాగా కొత్త బాధ్యతతో ఇక్కడకు వచ్చానని తెలిపారు. రైల్వే సహా అన్ని రంగాల్లోనూ పెట్టుబడులకు ద్వారాలు తెరిచామన్నారు. ఇంతకు ముందు మాట్లాడిన బ్రిటన్ ప్రధాని కామెరాన్ ఇరుదేశాల మధ్య పెనవేసుకున్న అనుంబంధాన్ని ప్రస్తావించారు.
ఒమర్ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోడీకి జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మద్దతు పలికారు. ఎంతసేపూ ప్రధానిని విమర్శించడం తగదని ఆయన స్పష్టం చేశారు. బ్రిటిష్ పార్లమెంటునుద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగం అద్భుతమని ఆయన ప్రశంసించారు.
The Indian PM made an excellent speech to British MPs in their Parliament. Why can't we just take pride in that???? https://t.co/O6Nt1ZlaUJ
— Omar Abdullah (@abdullah_omar) November 13, 2015 అలాంటి ప్రసంగం విన్నప్పుడు ప్రతి భారతీయుడు గర్విస్తాడని, అలాంటప్పుడు ఆయనను అభినందించాల్సిందేనని ఆయన చెప్పారు. ఎంత సేపూ ఆయనను విమర్శించడం కాదని, ఇలాంటప్పుడు అభినందించాలని ఆయన సూచించారు. అలాగే గార్డియన్ విలేకరి అడిగిన ప్రశ్న ప్రధాని స్థాయి వ్యక్తిని అడిగిన ప్రశ్నగా తాను భావించడం లేదని ఆయన ట్విట్టర్ ద్వారా అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications