షీనా హత్య: 2 లేఖలతో వారిని ఫూల్ చేసిన ఇంద్రాణి!
ముంబై: షీనా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియాను ఆదివారం వర్లిలోని ఆమె ఇంటికి పోలీసులు తీసుకు వెళ్లారు. కస్టడీ ముగుస్తుండటంతో కేసు విచారణకు సంబంధించి మరికొన్ని విషయాలు పరిశీలించేందుకు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లారు.
వర్లీలో ఉన్న ఆమె నివాసం నాలుగో అంతస్తుకు తీసుకెళ్లి అక్కడ గంట సేపు విచారించారు. షీనాను హత్య చేసిన రోజు ఆమెను ఎక్కడ ఉంచారు? ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? తదితర అంశాలపై పోలీసులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. విచారణ అనంతరం ఆమెను మళ్లీ పోలీస్ స్టేషన్కు తరలించారు.
సాయంత్రం నాలుగు గంటలకు ఆమెను ఇంటికి తీసుకు వెళ్లారు. ఇంద్రాణి భర్త పీటర్ అప్పుడు ఇంట్లోనే ఉన్నారు. సుమారు గంటపాటు విచారించారు. షీనా హత్య అనంతరం ఆమె మృతదేహాన్ని ఉంచిన గ్యారేజీని ఇంద్రాణి పోలీసులకు చూపించారని తెలుస్తోంది.
షీనా బోరా ఇంటి యజమానికి లేఖ పంపించిన ఇంద్రాణి!
షీనా బోరా ముంబైలోని ఓ ఇంటిలో అద్దెకు ఉండేది. షీనాను హత్య చేసిన అనంతరం ఇంద్రాణి.. తన కూతురు బతికి ఉన్నట్లుగా చూపించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. స్నేహితులకు ఇతరులకు షీనా పంపినట్లుగా మెయిల్స్ పంపించింది.
అంతేకాదు, షీనా అద్దెకు ఉంటున్న ఇంటి యజమానికి తన డ్రైవర్ ద్వారా లేఖ కూడా పంపించింది. షీనా అమెరికా వెళ్తోందని, ఆమె ఇక నుంచి అద్దెకు ఉండబోదని లేఖ రాసి ఇంటి యజమానికి పంపించింది.
మరో లేఖ కూడా ఇంద్రాణి పంపించింది. ఆ లేఖ షీనా ఉద్యోగం చేస్తున్న కంపెనీకి పంపింది. తాను అమెరికా వెళ్తున్నానని, ఉద్యోగం మానేస్తున్నట్లు షీనా రాసినట్లు పంపించింది. ఖర్ పోలీసులు ఆ లేఖలను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఎవరు రాశారో నిర్ధారించనున్నారు. కాగా, పోలీసులు షీనా మృతదేహానికి సంబంధించిన ఫోటోలను తీసుకున్నట్లుగా తెలుస్తోంది.