సుప్రీంకోర్టు ఏ ప్రాతిపదికన నోట్ల రద్దు నిర్ణయాన్ని ను సమర్థించింది?
మోదీ ప్రభుత్వం 2016లో తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా దాఖలైన 58 పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు సోమవారం తీర్పును వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్లో 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ నిర్ణయానికి సంబంధించిన పలు అంశాలను పిటిషనర్లు సుప్రీంకోర్టులో సవాలు చేశారు.
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పిటిషనర్ల వాదనలు విన్న తరువాత, కోర్టు తన తీర్పును 2022 డిసెంబర్ 7న రిజర్వ్ చేసింది. 2023 జనవరి 2, సోమవారం తుది తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ నజీర్ నేతృత్వంలోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించింది.
కానీ, ఈ ధర్మాసనంలోని జస్టిస్ బీసీ నాగరత్న కేంద్రం చర్య చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టు ఏ ప్రాతిపదికన డీమోనిటైజేషన్ను సమర్థించిందో, దానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను ఎందుకు తిరస్కరించిందో తెలుసుకోవడం ముఖ్యం.
లైవ్ లాలో ప్రచురించిన కథనం ప్రకారం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ చట్టంలోని సెక్షన్ 26(2)లో ఇచ్చిన అధికారాల ఆధారంగా ఎలాంటి బ్యాంకు నోట్ల సీరీస్ను అయినా రద్దు చేయవచ్చని జస్టిస్ గవాయ్ చెప్పారు.
ఈ విభాగంలో ఉపయోగించిన 'ఎలాంటి' అనే పదానికి కచ్చితమైన వివరణ ఇవ్వలేమని ఆయన అన్నారు. దీన్ని ఆధునిక ధోరణిలో ఆచరణాత్మకంగా అర్థం చేసుకోవాలని, అస్పష్టతకు దారి తీసే వివరణలను నివారించాలని అన్నారు. అలాగే వ్యాఖ్యానం ఇచ్చేటప్పుడు చట్టం ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్తో సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని, అందుకు ఇది ఇన్బిల్ట్ సేఫ్గార్డ్ అని, ఆర్థిక విధానం విషయంలో తీవ్ర సంయమనం పాటించాల్సిన అవసరం ఉందని జస్టిస్ గవాయ్ అన్నారు.
అయితే, 'అన్ని నోట్లను రద్దుచేయడం అనేది, ఎలాంటి నోట్ల ఏ సీరీస్ను అయినా చెలామణి నుంచి తప్పించడం కన్నా చాలా తీవ్రమైన చర్య' అని జస్టిస్ నాగరత్న అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ముందుగానే ఒక చట్టాన్ని జారీ చేసి ఉండాల్సిందని అన్నారు.
నోట్ల రద్దు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే, అది ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) కిందకు రాదని జస్టిస్ నాగరత్న అన్నారు. ఈ విషయంలో ముందే చట్టం చేయాలని, గోప్యత అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తెచ్చే మార్గాన్ని అవలంబించవచ్చని ఆమె అన్నారు.
మరోవైపు, నోట్ల రద్దుకు ప్రభుత్వం చెప్పిన కారణాలు, లక్ష్యాలు సరైనవేనని జస్టిస్ గవాయ్ సమర్థించారు.
- నోట్ల రద్దు: భారీ కుంభకోణం... ఆ 15 మంది కోసం మోదీ చేసిన కుట్ర - రాహుల్ గాంధీ
- 2 వేల రూపాయల నోట్లు ఏమైపోయాయి? ఈ నోటును కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తుందా?
ఎన్ని పిటిషన్లు వేశారు? ఎవరి వాదనలు ఏమిటి?
2016 నవంబర్ 8వ తేదీ సాయంత్రం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిర్ణయాన్ని ప్రధాని మోదీ స్వయంగా దేశ ప్రజలకు తెలిపారు.
ఒక్కసారిగా పెద్ద నోట్లు చెల్లకపోవడంతో, పాత నోట్లను మార్చుకోవడానికి, చిన్న నోట్లు తీసుకోవడానికి బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు జనం క్యూ కట్టారు. ఈ క్యూల పొడవు అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. కొన్ని వారాల పాటు ఈ పరిస్థితి కొనసాగింది.
నోట్ల రద్దు చర్యపై పలు వర్గాలు, పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. మొత్తం 58 పిటిషన్లు దాఖలయ్యాయి.
వీటిపై విచారణ ప్రారంభించే ముందు సుప్రీంకోర్టు, "ఇది అకడమిక్ సమస్య అయితే, దీనిపై కోర్టు సమయాన్ని వృథా చేయడంలో అర్థం లేదు. ఇది జరిగిన ఇన్నేళ్ల తరువాత దీన్ని ఈ స్థాయిలో విచారించాలా?" అని ప్రశ్నించింది.
అయితే, పిటిషనర్లు భవిష్యత్తు గురించి ప్రశ్నించారు. రాబోయే కాలంలో ఈ ఆర్బీఐ చట్టాన్ని మళ్లీ ఇలాగే ఉపయోగించవచ్చా అని అడిగారు.
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2) ప్రకారం, 'కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ సిఫార్సుపై గెజిట్ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ఎలాంటి బ్యాంకు నోట్ల సీరీస్ను అయినా సాధారణ వాడుక నుంచి రద్దు చేయవచ్చు. అయితే, నోటిఫికేషన్లో పేర్కొన్న సంస్థలో నిర్ణీత వ్యవధి వరకు ఈ నోట్లు చెల్లుబాటులో ఉంటాయి.'
ఆర్బీఐ చట్టం ప్రకారం నోట్ల రద్దుపై సూచనలు ఆర్బీఐ నుంచే రావాలని, కానీ, కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐకి సూచనలు ఇచ్చిందని, ఆ తరువాతే నోట్ల రద్దు ప్రకటించిందని పిటిషనర్ల తరపు న్యాయవాది పి. చిదంబరం కోర్టులో వాదించారు.
1946, 1978లలో కూడా నోట్ల రద్దు చేశారని, అయితే ప్రభుత్వాలు పార్లమెంట్లో చట్టాన్ని తీసుకువచ్చాకే రద్దు నిర్ణయాన్ని ప్రకటించాయని చెప్పారు.
నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన పత్రాలను కేంద్ర ప్రభుత్వం కోర్టు ముందు ఉంచలేదని చిదంబరం ఆరోపించినట్టు ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం.
సెంట్రల్ బోర్డు సమావేశంలో నియమాలను పాటించారా, కనీస సభ్యుల సంఖ్య షరతును నెరవేర్చారా లేదా అని కూడా ఆయన ప్రశ్నించారు.
- అభిప్రాయం: భారత ఆర్థిక రంగాన్ని దెబ్బతీసిన మోదీ నోట్ల జూదం
- అభిప్రాయం: మోదీకి ఇప్పుడు కొత్త నినాదాలు కావాల్సిందే!
ఆర్బీఐ వకీలు ఏం చెప్పారు?
"ఆర్బీఐ చట్టంలోని ఈ సెక్షన్.. ప్రక్రియ ప్రారంభం గురించి మాట్లాడదు. ఇందులో వివరించిన అన్ని దశలు పూర్తి కాకుండా ప్రక్రియ పూర్తి కాదని మాత్రం చెబుతుంది" అని ఆర్బీఐ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది జైదీప్ గుప్తా వాదించారు.
'మేం దీన్ని సిఫార్సు చేశాం' అని కూడా చెప్పారు.
గతంలో నోట్లు రద్దు చేసినప్పుడు అప్పటి ప్రభుత్వాల ప్రతిపాదనలను ఆర్బీఐ అంగీకరించలేదు కాబట్టే ఆ ప్రభుత్వాలు పార్లెమెంటులో చట్టాలు చేశాయని జైదీప్ గుప్తా అన్నారు.
ఆర్బీఐ కోర్టులో పత్రాలు సమర్పించలేదన్న ఆరోపణలను ఆయన ఖండించారు.
జనరల్ రెగ్యులేషన్స్, 1949 కోరమ్ (సమావేశంలో కనీస సభ్యులు ఉండాలన్న నియమం) సంబంధించిన షరతులను సెంట్రల్ బోర్డ్ సమావేశంలో అనుసరించినట్లు ఆర్బీఐ తెలిపింది.
ఈ సమావేశానికి ఆర్బీఐ గవర్నర్తో పాటు ఇద్దరు డిప్యూటీ గవర్నర్లు, ఆర్బీఐ యాక్ట్ కింద నామినేట్ అయిన అయిదుగురు డైరెక్టర్లు హాజరయ్యారని రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.
ఆర్బీఐ చట్టం ప్రకారం నిర్దిష్ట విలువ కలిగిన అన్ని నోట్లను ప్రభుత్వం రద్దు చేయలేదని చిదంబరం వాదించారు.
ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 26(2)ను మరొకసారి పరిశీలించి బోధపరచుకోవాలని, అందులో ఉన్న 'ఎలాంటి' అనే పదాన్ని 'ఏదో ఒకటి 'గా అర్థం చేసుకోవాలని ఆయన కోర్టుకు తెలిపారు.
అయితే ఇలాంటి వ్యాఖ్యానాలు గందరగోళాన్ని సృష్టిస్తాయని లాయర్ జైదీప్ గుప్తా అన్నారు.
అధిక ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో చెలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసే అధికారాన్ని ఆర్బీఐ నుంచి తప్పించాలని పిటిషనర్లు కోర్టును కోరుతున్నారని, అది సరి కాదని జైదీప్ అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ఇరుకు సందులు, రోడ్లపైనే సభలు ఎందుకు పెడుతున్నాయి?
- అమెరికా మహిళల క్రికెట్ జట్టులో సగం మంది తెలుగు అమ్మాయిలే...
- చెంఘిజ్ ఖాన్ ఓ బండి నిండా పురుగులను వెంటబెట్టుకుని ఎందుకు తిరిగేవాడు?
- బాపట్లలో 16వ నంబర్ జాతీయ రహదారిపై దూసుకెళ్లిన యుద్ధ విమానాలు, ఎందుకంటే...
- కందుకూరు: 'వద్దు మమ్మీ! అంటున్నా వెళ్లింది.. తిరిగి రాలేదు