చిన్నమ్మ వర్సెస్ ప్రతిపక్షాలు: జైలు మార్చితే పోరాటమే!, అడ్డునేందుకు ప్లాన్!
ఈ మేరకు అత్యవసర పిటిషన్ దాఖలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుప్పూరు విభాగం ఇప్పటికే నిర్ణయించగా.. శశికళను తమిళనాడు జైలుకు తరలిస్తే న్యాయపోరాటానికి తాము సిద్దం కావాల్సి వస్తుందని పీఎంకే వ్యవస్థాపకుడు
చెన్నై: సీఎం పీఠం కొద్దిలో తప్పిపోయినా.. తన నమ్మినబంబు పళనిస్వామిని సీఎంగా చేయడంలో అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ సఫలమయ్యారు. అనుయాయి అధికారంలో ఉండటంతో తన వ్యూహాలను జైలు నుంచే అమలు చేయాలని చిన్నమ్మ భావిస్తున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే బలపరీక్షలో పన్నీర్ సెల్వంను దెబ్బతీయగా.. తదుపరి చర్యగా ఆమె బెంగుళూరు పరప్పన జైలు నుంచి తమిళనాడుకు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసేందుకు అన్నాడీఎంకె నేతలు ఇప్పటికే కసరత్తులు మొదలుపెట్టగా.. చిన్నమ్మ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు సైతం వ్యూహాలు రచిస్తున్నాయి.
చిన్నమ్మ ఆలోచన ఇలా.. ప్రతిపక్షాలు అలా!..

ప్రస్తుతం తన గుప్పిట్లోనే ఉన్న తమిళనాడు ప్రభుత్వాన్ని పట్టు జారిపోనివ్వకుండా చూడాలనేది చిన్నమ్మ ఆలోచనైతే.. ఆమె తమిళనాడు జైలుకు మకాం మార్చితే ప్రభుత్వాన్ని బలహీనపరచాలనే తమ వ్యూహాలు బెడిసికొడుతాయనేది ప్రతిపక్షాల ఆలోచనగా తెలుస్తోంది.
శాంతి భద్రతలు.. అనారోగ్య కారణాలు:

ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతల అంశాన్ని తెరమీదకు తెచ్చి చిన్నమ్మ తమిళనాడుకు జైలుకు మకాం మార్చాలని భావిస్తోంది. తనను కలిసేందుకు నిత్యం వందల మంది అన్నాడీఎంకె కార్యకర్తలు జైలు వద్దకు వస్తుంటారని, దాంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశమున్నందునా.. తనను తమిళనాడు జైలుకు తరలించాలని పిటిషన్ ద్వారా శశికళ కోరనున్నారు.
దీనికి తోడు భద్రత మరియు అనారోగ్య కారణాలను కూడా ఆమె పిటిషన్ లో పేర్కొననున్నారు. ఇదిలా ఉంటే అటు ఆమ్ ఆద్మీ, పీఎంకె, డీఎంకె పార్టీలన్ని శశికళను తమిళనాడుకు రాకుండా అడ్డుపడేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.
శశికళపై ఆమ్ ఆద్మీ, పీఎంకె ఫైట్..

ఈ మేరకు అత్యవసర పిటిషన్ దాఖలు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుప్పూరు విభాగం ఇప్పటికే నిర్ణయించగా.. శశికళను తమిళనాడు జైలుకు తరలిస్తే న్యాయపోరాటానికి తాము సిద్దం కావాల్సి వస్తుందని పీఎంకే వ్యవస్థాపకుడు రామదాసు ప్రకటించారు. మరోవైపు డీఎంకె సైతం తమ ప్రయత్నాల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది.
పన్నీర్ కూడా ఆ ప్రయత్నాల్లోనే..

ఇక శశికళ చేతిలో భంగపాటుకు గురైన పన్నీర్ సెల్వం సైతం తన మద్దతుదారులతో శశికళ జైలు మార్పిడిపై చర్చించినట్లు సమాచారం. శశికళ తమిళనాడుక తరలితే తనకు మరింత ప్రతికూల పరిస్థితులు ఏర్పడే అవకాశమున్నందునా.. ఎలాగైనా శశికళను అడ్డుకోవాలని పన్నీర్ భావిస్తున్నారు.
మొత్తం మీద శశికళ వర్సెస్ ప్రతిపక్షాల రాజకీయాలతో తమిళనాట మరో ఆసక్తికర పోరుకు తెరలేచినట్లవగా.. ప్రతిపక్షాల ఎత్తులను శశికళ చిత్తు చేస్తారా? లేక ప్రతిపక్షాల ఎత్తులకు శశికళే చిత్తవుతారా? అన్నది వేచిచూడాలి.












Click it and Unblock the Notifications