మహాత్మాగాంధీ కలలను సాకారం చేస్తున్నాం : సీఏఏ చట్టంపై మోదీ కీలక వ్యాఖ్యలు
రెండు రోజుల పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం కోల్కతా శివారులోని బేలూరు మఠాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని
ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో పౌరసత్వ సవరణ చట్టం(CAA)గురించి మాట్లాడిన ఆయన.. మరోసారి దానిపై స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. దేశంలోని ఏ ఒక్క వ్యక్తి పౌరసత్వాన్ని లాగేసుకోవడం సీఏఏ ఉద్దేశం కాదని, పొరుగు దేశాల్లో వివక్ష,హింసకు గురై ఇక్కడకు వలసొచ్చిన మైనారిటీలకు పౌరసత్వం కల్పించడమే దాని ఉద్దేశం అని చెప్పారు. మొదటి రోజు బెంగాల్ పర్యటనలో సీఏఏ నిరసనల సెగ తగిలిన నేపథ్యంలో మోదీ మరోసారి ఇలా వివరణ ఇచ్చుకున్నారు.
సీఏఏ దేశానికి ఎందుకంత ముఖ్యమనేది భారతీయ యువత తెలుసుకోవాలన్నారు. ఈ చట్టం అనేక దుష్ప్రచారాలు,అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయన్నారు. దీంతో చాలామంది యువత అపోహల్లో మునుగుతోందని అన్నారు. వీటన్నింటికి సరైన సమాచారంతో సమాధానం చెప్పాలని అన్నారు. భారత రాజ్యాంగాన్ని అనుసరించి వేరే దేశం నుండి వచ్చిన ఎవరైనా ఇక్కడ పౌరులు కావచ్చన్న విషయం అందరం గుర్తుంచుకోవాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టం దానికి ఒక సవరణ మాత్రమే అన్నారు. ఇతర దేశాల్లో అత్యంత దుర్భర పరిస్థితుల్లో నివసిస్తూ.. ఇక్కడికి వలసొచ్చినవారికి పౌరసత్వం కల్పించాలన్న సవరణ చేశామన్నారు.

అంతేకాదు,మహాత్మాగాంధీ కలలను తాము సాకారం చేస్తున్నామని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ సహా పొరుగు దేశాల్లో హింసను అనుభవిస్తూ ఇక్కడికి వలసొచ్చినవారికి మానవత్వ ప్రాతిపదికన దేశ పౌరసత్వం కల్పించాలని మహాత్మాగాంధీ నుంచి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఎంతోమంది చెప్పారని గుర్తుచేశారు. ప్రసంగం మధ్యలో.. నేను చెబుతున్నది మీకు అర్థమవుతోందా..? అని అక్కడున్న యువతను ప్రశ్నించారు. దానికి అవును అంటూ వారు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టారు. దీంతో 'మీకు ఇది స్పష్టంగా అర్థమవుతోంది. కానీ పొలిటికల్ గేమ్స్ ఆడుతున్నవారు ఉద్దేశపూర్వకంగా దీన్ని తిరస్కరిస్తున్నారు. పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు' అంటూ విమర్శించారు.












Click it and Unblock the Notifications