సెన్సెక్స్ కంపెనీల్లోనూ లైంగిక వేధింపులు అధికమే!
న్యూఢిల్లీ: కార్పొరేట్ సంస్థల్లో మహిళా భద్రతకు ఎలాంటి ఢొకాలేదనేది అవాస్తవమని తేలిపోయింది. సాధారణ కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా బహుళజాతి సంస్థల్లోనూ లైంగిక వేధింపుల కేసులు భారీగా నమోదు కావడమే ఇందుకు నిదర్శనంగా తెలుస్తోంది.
నిరుడు విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్ సహా సెన్సెక్స్ సూచీ ఆధారిత 18 కంపెనీల్లో మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారని, సుమారు 370 ఫిర్యాదులు నమోదయ్యాయనే విషయం తాజా నివేదికల ద్వారా వెలుగు చూసింది.
పని ప్రదేశంలో లైంగిక వేధింపుల నిరోధ చట్టం, 2014 కింద కంపెనీలు ఈ వివరాలను బహిర్గతం చేశాయి. అయితే మెజార్టీ కేసులను సామరస్య వాతావరణంలో పరిష్కారించామని పలు కంపెనీలు తమ వార్షిక నివేదికలో పేర్కొన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతీ సుజుకీ, హీరో మోటోకార్ప్, హెచ్డీఎఫ్సీ, లుపిన్, లార్సెన్ అండ్ టుర్బో, బజాజ్ ఆటో, గెయిల్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ కంపెనీల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులు ఒక్కటి కూడా నమోదు కాకపోవడం విశేషం.
కాగా, 2014-15 ఆర్థిక సంవత్సరంలో విప్రోలో అత్యధికంగా 100 ఫిర్యాదులు, ఐసీఐసీఐ బ్యాంక్లో 94, ఇన్ఫోసిస్లో 53, యాక్సిస్ బ్యాంక్లో 34, టాటా స్టీల్ 24, సిప్లాలో 17, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 14 ఫిర్యాదులు నమోదయ్యాయి.
లైంగిక వేధింపుల ఘటనలను తగ్గించడానికి ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాలు, వర్క్షాపులు నిర్వహించి పలు కంపెనీలు తగిన చర్యలు తీసుకున్నాయి. నమోదైన 100 ఫిర్యాదుల్లో అంబుడ్స్మెన్ ద్వారా 92 కేసులను పరిష్కరించామని, ఈ కేసులు నమోదైన వారిపై తగిన చర్యలు తీసుకున్నామని విప్రో తన వార్షిక నివేదికలో పేర్కొంది.