బళ్లారి లేడీ కార్పొరేటర్ హత్య కేసులో ట్వీస్ట్: గాలి జనార్దన్ రెడ్డి మీద ఆరోపణ, ఎన్నికలు !
బెంగళూరు: బళ్లారి మహానగర పాలికే కార్పొరేటర్ పద్మావతి యాదవ్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. బళ్లారి మహానగర పాలికే లేడీ కార్పొరేటర్ పద్మవాతి యాదవ్ హత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మీద 8 ఏళ్ల తరువాత ఆరోపణలు వచ్చాయి.
ఎన్నికల రచ్చ
కర్ణాటకలో శాసన సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో బీజేపీ మాజీ నాయకుడు, మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మీద హత్య కేసు ఆరోపణలు రావడంతో బళ్లారి జిల్లాతో పాటు కర్ణాటక ఉలిక్కిపడింది. ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటక ఎన్నికల పర్యటనలో ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడంతో ఓ వర్గం ఆందోళన చెందుతోంది.
8 ఏళ్ల తరువాత
2010లో బళ్లారి కార్పొరేటర్ పద్మావతి యాదవ్ కు చెందిన భవనం నిర్మాణంలో ఉంది. అదే సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీని నిర్మాణంలో ఉన్న కట్టడంలోనే పద్మావతి యాదవ్ దారుణ హత్యకు గురైయ్యారు. కేసు సీఐడీకి అప్పగించారు.
హైకోర్టుకు బాధితులు
పద్మావతి యాదవ్ హత్య కేసులో ఐదు సంవత్సరాలు అయినా హంతకుల ఆచూకి చిక్కలేదు. సీఐడీ అధికారులు కేసు విచారణ చేస్తూనే ఉన్నారు. పద్మావతి యాదవ్ సోదరుడు సుబ్బరాయుడు న్యాయం చెయ్యాలని 2015 డిసెంబర్ నెలలో కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
సీ రిపోర్టు ఇచ్చిన సీఐడీ
పద్మావతి హత్య కేసులో విచారణ త్వరగా పూర్తిచేసి నివేదిక సమర్పించాలని న్యాయస్థానం సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. పద్మావతి హత్య కేసులో హంతకుల ఆచూకి చిక్కలేదని 2016 సెప్టెంబర్ లో సీఐడీ అధికారులు బళ్లారి కోర్టులో సీ రిపోర్టు సమర్పించారు.
గాలి జనార్దన్ రెడ్డి పేరు
పద్మావతి యాదవ్ హత్య కేసులో సీఐడీ దర్యాప్తును ప్రశ్నిస్తూ ఎస్ఐటీ తనిఖి చేయించాలని సుబ్బరాయుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే పద్మావతి యాదవ్ హత్య కేసుతో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధం ఉందని 2018 ఏప్రిల్ 30వ తేది ( నిన్న సోమవారం) సుబ్బరాయుడు బళ్లారి జిల్లా ఎస్పీ అరుణ రంగరాజన్ కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
మొదటి సారి రెడ్డి పేరు
పద్మావతి యాదవ్ హత్య జరిగి 8 ఏళ్లకు పైగా అయ్యింది. పద్మావతి యాదవ్ హత్య కేసులో గాలి జనార్దన్ రెడ్డి పేరు ఇంత వరకూ తెరమీదకు రాలేదు. అయితే కేవలం 12 రోజుల్లో శాసన సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓ మహిళా నాయకురాలి హత్య కేసులో గాలి జనార్దన్ రెడ్డి పేరు మొదటి సారి తెరమీదకు రావడంతో ఆయన వర్గీయులు హడలిపోయారు.