పాక్ ప్రతీకారంతో రగిలిపోతుంది జాగ్రత్త: ఇంటిలిజెన్స్
న్యూఢిల్లీ: సర్జికల్స్ స్ట్రైక్ దాడులు జరిపి 40 మందికి పైగా ఉగ్రవాదులను అంతం చెయ్యడాన్ని పాకిస్థాన్ జీర్ణించుకోలేకపోతుందని, దెబ్బకు దెబ్బ తియ్యాలని ప్రతీకారంతో రగిలిపోతుందని భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి.
150 మందికి పైగా ఉగ్రవాదులను 14 శిబిరాల్లో మోహరించినట్లు భారత నిఘా వర్గాలు హెచ్చరించాయి. తన పగ తీర్చుకోవడానికి ఉగ్రవాదులను భారత సైన్యంపైన, పౌర లక్షాలపైన, భద్రతా వ్యవస్థల పైన దాడులు చేయించే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఉగ్రవాదులకు పాక్ సైన్యం అన్నివిధాలా సాయం చేస్తుందని, నియంత్రణ రేఖ వెంబడి భారత సైనిక దళాలకు సంబంధించిన అన్ని వివరాలనూ అందజేస్తుందని భారత ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి.
ఉగ్రవాదులు భారత సైన్యం మీద దాడులు చేసేందుకు ప్యారాచూట్లు, పారా మోటార్లు, పారా గ్లైడర్ల వంటి ఏరియల్ డివైసెస్ ద్వారా భారత్ లోకి చొరబడే ప్రమాదం ఉందని సమాచారం. ఇప్పటికే కొందరు ఉగ్రవాదులు భారత సరిహద్దుల్లోకి వచ్చారని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
అయితే మన జవాన్లు అప్రమత్తంగా ఉన్న నేపధ్యంలో ఉగ్ర చొరబాట్లకు ఎలాంటి అవకాశం లేదని రక్షణ శాఖ అధికారులు అంటున్నారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా సరిహద్దు ప్రాంతాల్లో ప్యారాచూట్లు, డ్రోన్లు వంట ఎగిరే పరికరాలపై నిషేధం విధించారని సమాచారం.
సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎంటో చూపిస్తాం........ లష్కర్
అసలైన సర్జికల్ స్ట్రైక్స్ అంటే ఎంటో భారత్ కు చూపిస్తామని లష్కరే-ఏ-తోయిబా చీఫ్ హఫీజ్ సయిద్ హెచ్చరించాడు. ఎల్ వోసి వద్ద లష్కరే ఉగ్రవాదుల కార్యకలాపాలు ముమ్మరం చెయ్యాలని ఉగ్రవాదులకు పిలుపునిచ్చాడు.
సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులు భారత్ లోకి చొరబడటానికి సిద్దంగా ఉన్నారని ఇంటిలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలో జరిగిన సీసీఎస్ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఈ విషయంపై ప్రస్తావించారని సమాచారం.
చలికాలంలో మరింత మంది ఉగ్రవాదులు భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అజిత్ దోవల్ హెచ్చరించారని తెలిసింది. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ పేర్కొన్నారు.