పాక్ తారలు: మర్యాదగా 48 గంటల్లో వెళ్లిపోండి, లేదంటే
ముంబై: ఊడీ ఉగ్రదాడి ఘటన నేపధ్యంలో పాకిస్తాన్ నటీనటులు, ఆర్టిస్టులకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అల్టిమేటం జారీ చేసింది. వీరంతా 48 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది.
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అనుభంద సంస్థ అయిన (చిత్రపరిశ్రమ) చిత్రపట్ కర్మచారి సేన చీఫ్, ఎంఎన్ఎస్ నాయకుడు అమేయ్ ఖోషాక్ శుక్రవారం ఈ హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ నటీనటులు మర్యాదగా భారతదేశం విడిచిపెట్టి వెళ్లిపోవడానికి 48 గంటలు అవకాశం ఇస్తున్నాం.
అప్పటికి వారు దేశం విడిచి వెళ్లకపోతే మెడపట్టుకుని బయటకు గెంటేస్తామని అమేయ్ హెచ్చరించారు. ఇక్కడ తారలుగా వెలుగుతూ రెండు చేతులా సంపాధిస్తున్నారని, ఆ శత్రదేశం (పాకిస్తాన్) మాత్రం మా సైనికులను చంపేస్తున్నదని అన్నారు.
గతంలో పాకిస్తాన్ కళాకారులకు వ్యతిరేకంగా శివసేన, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ గజల్ గాయకుడు గులామ్ ఆలీ ఇటీవల ముంబైలో తన ప్రదర్శన ఏర్పాటు చేశారు. శివసేన, ఎంఎన్ఎస్ హెచ్చరికలతో ఆ ప్రదర్శన ముంబైలో రద్దు అయ్యింది.