పళనిస్వామి కేబినెట్ కూర్పు: సెంగొట్టాయన్-దినకరన్లకు మంత్రి పదవులు
అన్నాడీఎంకే నేత పళని స్వామి ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్ పైన కసరత్తు చేస్తున్నారు. సెంగొట్టాయన్, దినకరన్లకు మంత్రి పదవులు దక్కనున్నాయి.
చెన్నై: అన్నాడీఎంకే నేత పళని స్వామి ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేబినెట్ పైన కసరత్తు చేస్తున్నారు. సెంగొట్టాయన్, దినకరన్లకు మంత్రి పదవులు దక్కనున్నాయి.
పార్టీలో సెంగొట్టాయన్ సీనియర్ నేత. పళనిస్వామి కంటే ముందు ఆయన కూడా ముఖ్యమంత్రి రేసులో కనిపించారు. దినకరన్.. చిన్నమ్మ శశికళ అక్క కొడుకు. ఆయన ప్రస్తుతం పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గతంలో జయలలిత ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. అలాంటి దినకరన్కు శశికళ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు.
ఇంచార్జ్ గవర్నర్ విద్యాసాగర రావు తమకు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని అన్నాడీఎంకే నేత తంబీదురై వ్యాఖ్యానించారు. తాను బలపరీక్షలో నెగ్గుతామని చెప్పారు. జయ ప్రవేశ పెట్టిన పథకాలు కొనసాగుతాయని తెలిపారు. పన్నీరు సెల్వం మినహా అందరూ తమ వైపు ఉన్నారని చెప్పారు. కాగా, పళనిస్వామికి పన్నీరు మద్దతు ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఆయన తమ వైపు లేరని తంబీదురై చెప్పారు.
అనూహ్య మలుపు: సీఎంగా పళనిస్వామి, పన్నీరుసెల్వం మద్దతు?
కాగా, గత 11 రోజులుగా కొనసాగుతూ వచ్చిన తమిళనాడు రాజకీయ సంక్షోభానికి గవర్నర్ విద్యాసాగర రావు చెక్ పెట్టారు. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా శశికళ వర్గం సీఎం అభ్యర్థి పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించిన విషయం తెలిసిందే.
ఈ అంశంపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్... మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామికే ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమిచ్చారు. రెండు వారాల్లోగా పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. దీంతో ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు రాజ్భవన్లో పళనిస్వామి తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
గవర్నర్ నిర్ణయంతో శశికళ వర్గీయుల్లో ఆనందం నెలకొంది. గవర్నర్ ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయం తీసుకున్నారని వారు హర్ష వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గవర్నర్ నిర్ణయంతో పన్నీర్ సెల్వం వర్గంలో నిరాశ నెలకొంది.