గవర్నరే కీలకం: పన్నీరు, శశికళ బలాబలాలివే! తమిళనాడులో ఏం జరగొచ్చంటే..?
తమిళనాడు రాజకీయాలు గంటగంటకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది.
చెన్నై: తమిళనాడు రాజకీయాలు గంటగంటకు ఉత్కంఠగా మారుతున్నాయి. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ వర్గాల మధ్య పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇప్పటికే శశికళకు తనకు మద్దతుగా ఉన్న 130 మంది ఎమ్మెల్యేలను తన క్యాంపునకు తరలించినట్లు వార్తలు వచ్చాయి.
వీరందర్నీ నగరంలోని పలు హోటల్స్కు శశికళ వర్గీయులు తరలించారు. అయితే పన్నీర్ సెల్వం కూడా తనకు అవకాశమిస్తే బలాన్ని నిరూపించుకుంటానని చెప్పడం గమనార్హం. అయితే పన్నీర్కు ఇదంత సులువు కాదని చెప్పొచ్చు. కాగా, ఇప్పటి వరకు సుమారు 22మంది ఎమ్మెల్యేలు.. పన్నీరుకు మద్దతు తెలిపినట్లు సమాచారం. అయితే, సీఎం పదవి నిలబెట్టుకోవడానికి ఆయనకు ఇంకా దాదాపు వందమంది వరకు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.
నేడే బలప్రదర్శన: శశికళకు పట్టం కడతారా? పన్నీరునే నిలబెడతారా?
కాగా, ఎన్నికలకు ముందే టికెట్ల పంపకంలో శశికళ వ్యూహాత్మకంగా తనకు అనుకూలురైన ఎక్కువమందికి టికెట్లు ఇప్పించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఇది కలిసి వచ్చే అంశంగా మారింది. అయితే, వారంతా ప్రజాభిప్రాయం ఎవరి వైపు మొగ్గు చూపితే వారు అటువైపే వెళ్లే అవకాశమూ లేకపోలేదు.
ఇది ఇలా ఉంటే.. పన్నీర్ సెల్వంకు పార్టీశ్రేణులతో పాటు ప్రజల్లోనూ సానుభూతి పెరిగిపోతోంది. అమ్మకు నమ్మకస్తుడు, మూడోసారి సీఎంగా ఉన్న సమయంలోనే వర్ద తుపాను అనంతరం సహాయచర్యలు చేపట్టడంతో పాటు జల్లికట్టుకు అనుమతి పొందడంతో విజయం సాధించారని చెప్పవచ్చు.
ఈ పరిస్థితుల్లో గవర్నర్ ఏం చేయవచ్చన్న అంశంపై రాజ్యాంగ నిపుణులు నాలుగు పద్దతులను సూచిస్తున్నారు. అయితే, ఏం చర్య తీసుకున్నా గవర్నర్ విచక్షణాధికారాలపై ఆధారపడి వుంటుంది. కేంద్రం కూడా పరిస్థితులను బట్టి చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది.
ఏ చర్యలు తీసుకోవచ్చంటే..: గవర్నర్, కేంద్రం నిర్ణయాలే కీలకం
గవర్నర్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీని సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. కొద్ది కాలం అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడిన అనంతరం రాష్ట్రపతి పాలన ఎత్తివేసి మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరివైపు మొగ్గితే వారిని సీఎంగా చేసే అవకాశముంది.
- అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధింపు కూడా విధించే అవకాశం కూడా ఉంది.
- శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి బలనిరూపణకు గడువు ఇవ్వడం.
- పన్నీర్ సెల్వం తన రాజీనామా వెనక్కు తీసుకుంటానని కోరే అవకాశముంది. ఈ విజ్ఞప్తిని గవర్నర్ పరిశీలించి ఆయనను సీఎంగా కొనసాగమని కోరే అవకాశం కూడా ఉంది. అయితే ఈ దశలో శశికళ వర్గ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానంతో ముందుకు వచ్చే అవకాశమూ లేకపోలేదు.
-కొంత కాలంపాటు అపద్ధధర్మ ముఖ్యమంత్రిగా పన్నీరుసెల్వను కొనసాగించే అవకాశం కూడా లేకపోలేదు.