నేడు వీరభద్రుడు: వాద్రాపై ఇష్యూపై సోనియా గరం
న్యూఢిల్లీ: వ్యాపం కుంభకోణం, లలిత్ గేట్ వ్యవహారాలపై అధికార బిజెపిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగిద్దామని భావించిన కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. అధికార బిజెపిని చిక్కుల్లో పడేయాలని భావించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు అవినీతి కేసుల్లో దొరికిపోతున్నారు. వాటితో బిజెపి కాంగ్రెసుపై ఎదురు దాడికి దిగుతోంది.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో బిజెపి ఆత్మరక్షణ కోసం ఎదురు దాడికి దిగూతూ కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వ్యవహారాలను ముందుకు తెస్తూ కాంగ్రెసును చిక్కుల్లో పడేసే ప్రయత్నం చేస్తోంది. నిన్న ఉత్తరాఖండ్ సిఎం హరీశ్ రావత్ అవినీతిని బయటపెట్టిన బిజెపి నేడు హిమాచల్ ప్రదేశ్ సిఎం వీరభద్రసింగ్ వ్యవహారాన్ని తవ్వి తీసింది.
వీరభద్ర సింగ్ పన్నులు ఎగవేతకు పాల్పడటమే కాకుండా లెక్కకు మించిన మొత్తాలను ఖాతాలో కలిగి ఉన్నారంటూ ఆధారాలు చూపింది. దానికితోడు క్విడ్ ప్రో కో ద్వారా కంపెనీల నుంచి లబ్ది పొందారని తెలిపింది. వీరభద్రసింగ్ ఆర్ధిక అవకతవకలపై నిగ్గు తేల్చాలంటూ ఆదాయం పన్ను శాఖ ఎన్ఫోర్స్ డైరక్టరేట్ను ఆదేశించింది. తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని వీరభద్రసింగ్ వాదిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల వేళ బయటపెట్టడం ద్వారా బిజెపి లబ్ది పొందాలని చూస్తోందని అన్నారు.

రాబర్ట్ వాద్రా ఫేస్బుక్ వ్యాఖ్యలపై గందరగోళం
పార్లమెంటు సభ్యులను అవమానించే విధంగా సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా ఫేస్బుక్లో వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై గురువారం లోకసభ అట్టుడికింది. రాబర్ట్ వాద్రా చేసిన వ్యాఖ్యలను బిజెపి సభ్యుడు ప్రహ్లాద్ జోషీ ప్రస్తావించారు. వాద్రాపై సభా హక్కుల కమిటీకి నివేదించాలని ఆయన కోరారు. రాబర్ట్ వాద్రా అంశాన్ని ప్రస్తావించినప్పుడు సోనియా గాంధీ లేచి నిలబడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జోషీ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని మల్లికార్జున్ ఖర్గే స్పీకర్ సుమిత్రా మహాజన్ను కోరారు.
కాగా, సభలో సమస్యలపై చర్చించుకుంటేనే పరిష్కారం లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయపడ్డారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచం మనల్ని నిశితంగా గమనిస్తోందని, ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు.
కొత్త విషయాలపట్ల మన ఆలోచలనలు విభిన్నంగా ఉండాలని, ఆలోచనలు స్వేచ్ఛగా పంచుకునే అవకాశం కూడా ఉండాలని మోడీ అన్నారు. పార్లమెంట్లో కేవలం ప్రసంగాలే దేశానికి ప్రయోజనం కాదని ఆయన అన్నారు.
మన్మోహన్కు మోడీ నమస్కారం
వ్యాపం, లలిత్ మోడీ అంశాలపై అట్టుడుకుతున్న పార్లమెంట్లో వాయిదా సమయంలో గురువారంనాడు ఆసక్తికరమైన విషయాలు చోటు చేసుకున్నాయి. రాజ్యసభను చైర్మెన్ అన్సారీ వాయిదా వేసే కొద్ది సమయం ముందు ప్రధాని మోడీ సభలోకి ప్రవేశించారు. వాయిదా అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దగ్గరకు వెళ్లి నమస్కరించారు. అక్కడే ఉన్న ఇతర కాంగ్రెస్ ఎంపీలను కూడా పలకరిస్తూ కరచాలనం చేశారు. వామపక్షాల ఎంపీలను కూడా ఆయన నవ్వుతూ పలకరించారు.












Click it and Unblock the Notifications