Parliament Round Up Today: లోక్ సభలో ఢిల్లీ పోలీసు యాక్ట్ సవరణ బిల్లు, రాజ్యసభలో వైసీపీ ప్రైవేట్ బిల్లులు
సీబీఐ పరిధిని పెంచేందుకు ఉద్దేశించిన ఢిల్లీ పోలీసు చట్ట సవరణ బిల్లును లోక్ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. గతంలో చంద్రబాబు, మమతా బెనర్జీ వంటి ముఖ్యమంత్రులు తమ రాష్ట్రాల్లోకి సీబీఐ ఎంట్రీ కాకుండా నిషేధాలు విధించారు. దీంతో సీబీఐ పరిధిని పెంచుతూ కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. అలాగే టీఆర్ఎస్ వరిధాన్యం కొనుగోలుపై కేంద్రానికి ప్రశ్నోత్తరాల సమయంలో విజ్ఞప్తి చేసింది. అటు వైసీపీ కూడా ఏపీలో వైద్య కళాశాలల ఏర్పాటుకు సహకరించాలని కేంద్రాన్ని కోరింది.
రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ పై నిరసనలు ఇవాళ కూడా కొనసాగాయి. అదే సమయంలో వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మూడు ప్రైవేటు మెంబర్ బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టారు. ఇందులో అమ్మఒడి పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఓ బిల్లు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ భృతి అమలు చేయాలంటూ మరో బిల్లు, ప్రార్ధనా స్ధలాలపై దాడులకు పాల్పడే వారికి గరిష్టంగా 20 ఏళ్ల జైలు శిక్ష విధించేలా చట్టాల్ని సవరించాలని కోరుతూ మూడో ప్రైవేటు బిల్లును ఆయన ప్రవేశపెట్టారు.

అలాగే రాజ్యసభలో విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు వాణిజ్య, పరిశ్రమల మంత్రి అనుప్రియా పటేల్ జవాబు ఇచ్చారు.
ఎగుమతులలో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోగతి సాధించినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ రాజ్యసభకు తెలిపారు. సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 2016-17లో ఆంధ్రప్రదేశ్ నుంచి 11,939 కోట్ల రూపాయల విలువైన ఎగుమతులు జరగ్గా 2020-21 నాటికి ఎగుమతుల విలువ 16,842 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. ఎగుమతుల్లో ఆక్వా ఉత్పత్తులు, డ్రగ్స్, ఫార్మా, కెమికల్స్ ఉత్పాదనలు, పండ్లు, కూరగాయలు ప్రధాన భూమిక పోషించినట్లు ఆమె తెలిపారు. దేశం మొత్తం మీద ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్దే అతి పెద్ద వాటా అని చెప్పారు.
అటు బీఎస్ఎన్ఎల్ను ప్రైవేటీకరించే ప్రతిపాదన లేదని కేంద్రం ఇవాళ పార్లమెంటులో వెల్లడించింది.
భారత్ సంచార్ నిగమ్ను ప్రైవేటీకరించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసింహ్ చౌహాన్ రాజ్యసభకు తెలిపారు. విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)ను పునరుద్ధరించే ప్రణాళికకు ప్రభుత్వం 2019 అక్టోబర్ 23న ఆమోదం తెలిపిందన్నారు.. ఈ ప్రణాళికలో భాగంగా 50 ఏళ్ళ పైబడిన ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించి ఉద్యోగులపై ఖర్చును తగ్గించుకోవడంతోపాటు బడ్జెటరీ కేటాయింపుల ద్వారా 4జీ సేవలు అందించడానికి అవసరమైన స్పెక్ట్రమ్ సమకూర్చుకోవడం, అప్రధానమైన ఆస్తుల విక్రయం ద్వారా నిధులు సేకరించి రుణభారం తగ్గించుకోవడం ఈ ప్రణాళికలో భాగమని మంత్రి తెలిపారు.
మరో ప్రశ్నకు సమాధానంగా ఏపీలో మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలు 1787 ఉన్నాయని మంత్రి చౌహన్ వెల్లడించారు. మొబైల్ కనెక్టివిటీ లేని ఈ మొత్తం గ్రామాల్లో 1126 గ్రామాలు విశాఖపట్నం జిల్లాలోనే ఉన్నట్లు తెలిపారు. యూనివర్శల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ (యూఎస్ఓఎఫ్) కింద విశాఖపట్నం జిల్లాలోని 1054 గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ కల్పించే పనులు చేపడుతున్నట్లు మంత్రి చెప్పారు. మొబైల్ సేవలు కల్పించే ప్రాజెక్ట్పై కంట్రాక్టర్తో ఒప్పందం కుదుర్చుకున్న 18 నెలల్లో ఆయా గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ ఏర్పడుతుందని తెలిపారు.
పార్లమెంట్ హైలెట్స్
- పార్లమెంట్ శీతాకాల సమావేశాల ఐదో రోజు ఉభయసభలు ప్రారంభం
- లోక్ సభ, రాజ్యసభలో యథావిధిగా ప్రశ్నోత్తరాల సమయం
- ప్రశ్నోత్తరాల సమయంలో వరి కొనుగోళ్లు చేపట్టాలని కేంద్రాన్ని కోరిన టీఆర్ఎస్ ఎంపీ నామా
- ప్రశ్నోత్తరాల సమయంలో ఏపీలో మెడికల్ కాలేజీలకు సహకరించాలని కోరిన వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- ప్రశ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ వద్దని కోరిన టీఎంసీ ఎంపీ నుస్రత్ జహాన్
- రాజ్యసభలో మూడు ప్రైవేటు మెంబర్ బిల్స్ ప్రవేశపెట్టిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
- బీఎస్ఎన్ ఎల్ ప్రైవేటీకరించే యోచన లేదని రాజ్యసభలో తెలిపిన కేంద్రం
- ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతులు పెరిగాయని రాజ్యసభలో ప్రకటించిన కేంద్రం












Click it and Unblock the Notifications