PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..!
ఇరాన్ యుద్దం కారణంగా దేశవ్యాప్తంగా ఎదురవుతున్న చమురు, ఎల్పీజీ కొరతలు కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ కొరత కారణంగా లక్షలాది ఇళ్లలో పేదలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎల్పీజీ ఇబ్బందుల్ని తాత్కాలికంగా అధిగమించేందుకు వీలుగా మళ్లీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కిరోసిన్ (kerosene oil)పంపిణీకి అత్యవసర ఆదేశాలు ఇచ్చింది.
దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం గతంలో రేషన్ దుకాణాల ద్వారా కిరోసిన్ పంపిణీని నిలిపేసింది. ఇప్పుడు ఎల్పీజీ కొరత నేపథ్యంలో మళ్లీ మిగతా రాష్ట్రాలతో సమానంగా రేషన్ దుకాణాల ద్వారా ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కిరోసిన్ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వంట, దీపాల అవసరాల కోసం, గృహ వినియోగం కోసం రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) నాణ్యమైన కిరోసిన్ (ఎస్కెఒ)ను తాత్కాలికంగా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం 60 రోజులకు అత్యవసర ఆదేశాలు ఇచ్చింది.

కిరోసిన్ కేటాయింపుతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అధికారులు తిరిగి రేషన్ షాపుల ద్వారా పరిమిత పరిమాణంలో కిరోసిన్ కిరోసిన్ను పంపిణీ చేస్తారు. 60 రోజుల కాలంలో బలహీన వర్గాల కుటుంబాలకు ఇంధన లభ్యతను స్థిరీకరించడానికి రూపొందించిన అత్యవసర ఏర్పాటులో భాగంగా ఈ చర్య తీసుకున్నారు. సడలించిన నిబంధనల ప్రకారం పెట్రోల్ పంపులు కూడా పరిమిత పరిమాణంలో కిరోసిన్ను నిల్వ చేయడానికి, పంపిణీ చేయడానికి అనుమతిస్తారు. నిల్వ, పంపిణీ నిబంధనలను సడలించడం వల్ల స్థానిక స్థాయిలో కిరోసిన్ సరఫరా సులభతరం అవుతుందని మరియు విస్తృత లభ్యతకు దోహదపడుతుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications