ఎలక్షన్లయిపోయాయ్: బాదుడు మొదలుపెట్టేశారుగా: పెట్రోల్, డీజిల్ రేట్లు పెంపు
న్యూఢిల్లీ: ఇన్ని రోజులూ వాహనదారులకు ఊరట కల్పిస్తూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. వాటి గ్రాఫ్ పైకి ఎగబాకడం మొదలు పెట్టినట్టే. ఇదివరకు వరుసగా నాలుగుసార్లు తగ్గుముఖం పట్టిన ఇంధన ధరల్లో పెరుగుదల నమోదైంది. చివరిసారిగా కిందటి నెల 15వ తేదీన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. 18 రోజుల విరామం అనంతరం.. వాటి రేట్లల్లో కదలిక నెలకొంది. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండోరోజే ఇంధన ధరలు పెరగడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
ఎంత పెరిగిందంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించిన తాజా సవరణల ప్రకారం..దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 15 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 16 పైసల మేర పెరిగాయి. దీనితో ఢిల్లీలో లీటర్ పెట్రోల్-రూ.90.55, డీజిల్ 80.91 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోలు రేటు 96.95 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 87.98 పైసలకు చేరింది.
చెన్నైలో పెట్రోలు రూ. 92.55, డీజిల్ ధర రూ. 85.90, కోల్కతలో పెట్రోలు రూ.90.76 పైసలు, డీజిల్ ధర రూ.83.78 పైసలు పలుకుతోంది. పాట్నాలో పెట్రోల్-92.87, డీజిల్-86.14, బెంగళూరులో పెట్రోల్-93.60, డీజిల్-85.81, హైదరాబాద్-94.18, డీజిల్-88.23, భోపాల్లో పెట్రోల్-98.57, డీజిల్-89.17, చండీగఢ్లో పెట్రోల్-87.15, డీజిల్-80.62, లక్నోలో పెట్రోల్-88.58, డీజిల్-81.31గా రికార్డయ్యాయి. రాష్ట్రాల ప్రభుత్వాలు విధించిన విలువ ఆధారిత ధరల ప్రకారం.. వేర్వేరు చోట్ల వేర్వేరు రేట్లు ఉంటాయి.
66 రోజుల తరువాత తొలిసారిగా..
పెట్రోల్, డీజిల్ ధరలు 66 రోజుల తరువాత తొలిసారిగా పెరిగాయి. చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన వాటి రేట్లు పెరిగాయి. ఈ మధ్యకాలంలో అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ తొలిదశ ఎన్నికల ముందు అయిదు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఇంధన ధరలను తగ్గించాయి చమురు సంస్థలు.
చివరిసారిగా కిందటి నెల 15వ తేదీన కూడా వాటి రేట్లను తగ్గించాయి. 18 రోజుల తరువాత మళ్లీ వాటి రేట్లు పెరుగుదల బాట పట్టాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండోరోజే రేట్లు పెరగడం విమర్శలకు దారి తీస్తోంది.
Recommended Video
క్రూడాయిల్ ధరల్లో..
అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల్లో పెరుగుదల చోటు చేసుకుంటోంది. గతవారం క్రూడాయిల్ రేట్లు భారీగా పెరిగాయి. ఆరు వారాల గరిష్ఠ పెరుగుదల కనిపించింది. డాలర్ బలపడటం, చమురు ఉత్పాదక దేశాలు ఇంధన ఉత్పత్తిని మరింత పెంచాలని నిర్ణయించడం కొంత ఊరట కలిగిస్తోంది. అమెరికన్ మార్కెట్ బ్రెంట్ క్రూడాయిల్ రేటులో 0.32 పెరిగింది. దీనితో బ్యారెల్ ఒక్కింటికి 67.40 డాలర్ పలుకుతోంది. యూఎస్ వెస్ట్ ట్యాక్సెస్ ఇంటర్మీడియట్లోనూ డాలర్ 0.67 మేర పెరుగుదలను నమోదు చేసుకుంది. బ్యారేట్ రేటు 64.58 వద్ద నిలిచింది.