దేశంలో ఫైజర్, మోడెర్నా: మెట్టు దిగిన మోడీ సర్కార్: పరిహారానికి ఓకే?
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఇదివరకు నాలుగు లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. ఈ మధ్య కాలంలో లక్షన్నర కంటే దిగువకు పరిమితమైంది. పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతోంది. అయినప్పటికీ- మరణాల్లో మాత్రం అదే తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కరోనా మరణాలు మూడువేలకు తగ్గట్లేదు. అదే బెంచ్ మార్క్తో కరోనా మరణాల్లో ఉధృతి నెలకొంటూనే ఉంది. తాజా బులెటిన్ ప్రకారం..దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,32,788 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,207 మరణాలు రికార్డయ్యాయి.
టీకాలు దొరక్క..
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత.. యాక్టివ్ కేసులకు అనుగుణంగా ఆక్సిజన్, పడకలు అందుబాటులో లేకపోవడం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత వంటివి మరణాలు రేటు పెరగడానికి కారణమౌతోందనేది బహిరంగ రహస్యంగా మారింది. ఈ పరిణామాల మధ్య దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిస్తోంది. మూడోదశ వ్యాక్సినేషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిప్పటికీ.. టీకాల కొరత వెంటాడుతోంది. ఫలితంగా- అనేక రాష్ట్రాలు మూడోదశ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. టీకాల లభ్యత ఉన్నంత మేర కొన్ని రాష్ట్రాలు మూడోదశను కొనసాగిస్తోన్నాయి.
త్వరలో ఫైజర్, మోడెర్నా కూడా..
వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలకు అదనంగా స్పుత్నిక్ వీ కూడా వచ్చి చేరింది. త్వరలో దీన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి పూర్తిస్థాయిలో అనుమతించబోతోంది కేంద్ర ప్రభుత్వం. వాటికితోడుగా అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ను కూడా అనుమతి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి షరతులతో కూడిన నష్ట పరిహారాన్ని అందించడానికి కేంద్రం అంగీకరించిందని అధికార వర్గాలు ధృవీకరించాయి. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఏకకాలంలో అందుబాటులో రావచ్చొని చెబుతున్నాయి. దీనిపై డ్రగ్ కంట్రోలర్ జనరల్ సంప్రదింపులు చివరిదశలో ఉన్నట్లు తెలిపాయి.
ప్రపంచవ్యాప్తంగా 430 మిలియన్ల డోసులు..
అతి కొద్దిరోజుల్లోనే ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు వెల్లడించినట్లు తెలిపింది. ఇదివరకు ఫైజర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆల్బర్ట్ బౌర్లా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారత్లో తమ వ్యాక్సిన్ వినియోగానికి అవసరమైన అనుమతుల కోసం ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా తాము 430 మిలియన్ల డోసుల ఫైజర్-బయోఎన్టెక్ వ్యాక్సిన్లను సరఫరా చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది చివరినాటికి తయారీ సామర్థ్యాన్ని కూడా 2.5 బిలియన్ డోసుల వ్యాక్సిన్కు పెంచుతామని అన్నారు.
ఫైజర్ ఎఫీషియన్సీపై
నిజానికి- అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ పాటికి ఫైజర్ వ్యాక్సిన్ భారత్లో ఎంట్రీ ఇచ్చి ఉండేదే. అదనపు సమాచారం కావాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇచ్చిన సూచనలకు ఫైజర్ అప్పట్లో అంగీకరించలేదు. డీసీజీఐకి దాఖలు చేసుకున్న తన దరఖాస్తులను సైతం వెనక్కి తీసుకుంది. అమెరికా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఫైజర్ టీకానే పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. మోడెర్నా సైతం వినియోగంలో ఉన్నప్పటికీ.. మెజారిటీ వాటా ఫైజర్దే. దాని ఎఫీషీయన్సీ కూడా అధికంగా ఉంటోంది.