కాలువ దాటేందుకు పోలీస్ మీద ఎక్కిన ఎమ్మెల్యే
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అధికార దుర్వినయోగానికి పాల్పడ్డాడు. ఓ చిన్న కాలువను దాటేందుకు వ్యక్తిగత భద్రతాధికారి (పిఎస్ఓ)పై ఎక్కాడు. అతనిపై ఎక్కని ఎమ్మెల్యే ఆ కాలువను దాటాడు.
కాగా, ఈ తతంగాన్ని ఫొటోలు తీసిన కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఎమ్మెల్యేగారి అధికార దుర్వినియోగం వెలుగులోకి వచ్చింది. అయితే ప్రభుత్వం ఆ వ్యక్తిగత భద్రతాధికారిని తనకు సహాయం చేసేందుకు కేటాయించిందని ఎమ్మెల్యే చెబుతున్నారు.

‘ఇది అధికార దుర్వినియోగం కాదు. పిఎస్ఓను నాకు సహాయంగా ఉండేందుకే నియమించింది. చిన్న కాలువను దాటేందుకు అతను నాకు సాయం చేశాడు. ఇందులో తప్పేముంది' అని ఆ ఎమ్మెల్యే కిషన్ లాల్ చెప్పారు.
ఛాంబ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన ఆ ఎమ్మెల్యేను కాలువ దాటేందుకు సదరు అధికారి తనపై ఎక్కించుకుని దాటించారు. పిఎస్ఓ, తాను ఒకరికొకరం సహాయం చేసుకుంటామని ఎమ్మెల్యే చెప్పారు. అతడు తనకు స్వచ్ఛందంగా సహాయం చేశాడని, అతడు బానిస కాదని అన్నారు.
తామిద్దరం ప్రజలకు సేవకులమని ఆ ఎమ్మెల్యే తెలిపారు. ఈ ప్రాంతంలోని ప్రజలకు కొన్ని సంవత్సరాల నుంచి తాను వైద్యుడిగా సేవలందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఆ ఎమ్మెల్యే కాలువను స్వయంగా దాటేవారు. అయితే ఎమ్మెల్యే అయిన తర్వాత పిఎస్ఓను ప్రభుత్వం కేటాయించడంతో అతని సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications