డిగ్రీ అడ్మిట్ కార్డులపై ప్రధాని మోడీ, క్రికెటర్ ధోనీ ఫొటోలు: విద్యార్థుల పనేనా?
పాట్నా: డిగ్రీ పరీక్షల అడ్మిట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతోపాటు తదితర ప్రముఖుల ఫొటోలు ఉండటం కలకలం రేపుతోంది. బీహార్ రాష్ట్రంలోని ఓ యూనివర్సిటీ పరీక్షలో చోటు చేసుకున్న ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతుండటంతో సదరు వర్సిటీ కఠిన చర్యలకు సిద్ధమైంది. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించింది.
డిగ్రీ అడ్మిట్ కార్డులపై ప్రధాని మోడీ, ధోనీల ఫొటోలు
వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని లలిత్ నారాయణ్ మిథిలా యూనివర్సిటీలో డిగ్రీ పరీక్షల కోసం ఇటీవల అడ్మిట్ కార్డులు జారీ చేశారు. అయితే, కొన్ని అడ్మిట్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ, బీహార్ గవర్నర్ ఫగూ చౌహన్ ఫొటోలు ఉన్నాయి. మధుబనీ, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల పరిధిలోని కాలేజీలకు చెందిన బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థులకు ఇలాంటివి ఎక్కువగా వచ్చాయి.
సోషల్ మీడియాలో అడ్మిట్ కార్డుల కలకలం
మోడీ, ధోనీతోపాటు పలువురు ప్రముఖుల ఫొటోలు అడ్మిట్ కార్డులపై రావడంతో అవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం యూనివర్సిటీ దృష్టికి రావడంతో అధికారులు స్పందించారు. అడ్మిట్ కార్డుల జారీ ప్రక్రియ అన్లైన్లో కొనసాగుతుందని, విద్యార్థులే తమ ఫొటోలతోపాటు వివరాలను అప్లోడ్ చేయాలని చెప్పారు. ఆ తర్వాత వాటిని పరిశీలించి అడ్మిట్ కార్డులు పరిశీలిస్తామన్నారు.
ఆ విద్యార్థులపై కఠిన చర్యలకు సిద్ధమైన వర్సిటీ
అయితే, కొందరు విద్యార్థులు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని యూనివర్సిటీ రిజిస్ట్రార్ తెలిపారు. ఇప్పటికే పలువురు విద్యార్థులకు షోకాజు నోటీసులు జారీ చేశామన్నారు. వారిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తామన్నారు. యూనివర్సిటీ ప్రతిష్టకు భంగం కలిగించే ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు పలు యూనివర్సిటీల్లో గతంలో చోటు చేసుకున్నాయి. ఇలాంటివి ఎక్కువగా ఓటర్ ఐడీ కార్డులు, రేషన్ కార్డుల పంపిణీ సమయంలో గతంలో జరుగుతుండేవి.