జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగం- జూన్ 21 నుంచి అందరికీ ఉచిత వ్యాక్సినేషన్
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశం ఎదుర్కొంటున్న పరిస్ధితులపై ప్రధాని మోడీ ఇవాళ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రధాని మోడీ గుర్తుచేశారు. దేశంలో కరోనా నేపథ్యంలో వైద్య సదుపాయాలను యుద్ధప్రాతిపదికన అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రదాని తెలిపారు. ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ప్రపంచంలో నలుమూలల నుంచీ తెప్పించామని, వ్యాక్సిన్ తయారీదారులకు కేంద్రం అండగా నిలుస్తోందని మోడీ తెలిపారు.
Recommended Video
కరోనా ధర్డ్వేవ్ హెచ్చరికల నేపథ్యంలో చిన్నారుల్ని రక్షించుకునేందుకు టీకాల అవసరం ఉందని ప్రధాని మోడీ తెలిపారు. ఇందుకోసం ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. మన శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తారన్న నమ్మకం తనకు ఎప్పుడో కలిగిందని, కరోనా ఫస్ట్వేవ్ సమయంలోనే టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కవరేజ్ 90 శాతంగా ఉందని మోడీ వెల్లడించారు. 2014లో మన దేశంలో వ్యాక్సిన్ కవరేజ్ 60 శాతమే ఉండేదన్నారు.. కానీ మిషన్ ఇంద్రధనుష్ ద్వారా దీన్ని 90 శాతానికి తీసుకెళ్లగలిగామన్నారు.ప్రస్తుతం అన్ని దేశాల వ్యాక్సిన్ల తయారీ సామర్ధ్యం కలిపినా డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.
ఇప్పటివరకూ దేశంలో 23 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేయగలిగామని ప్రధాని మోడీ తెలిపారు. త్వరలో వ్యాక్సిన్ సరఫరా పెరుగుతుందన్నారు. ప్రస్తుతం దేశంలో ఏడు సంస్ధలు వేర్వేరు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయని, మూడు వ్యాక్సిన్ ట్రయల్స్ అడ్వాన్సెడ్ స్టేజ్లో ఉన్నాయని ప్రదాని వెల్లడించారు. పిల్లల వ్యాక్సిన్లపైనా ట్రయల్స్ కొనసాగుతున్నాయన్నారు. మరోవైపు జూన్ 21 నుంచి 18 ఏళ్ల వయసు పైబడిన వారి కోసం రాష్ట్రాలకు ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని ప్రదాని మోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ల కొనుగోలులో 25 శాతం మొత్తం కేంద్రమే భరించి రాష్ట్రాలకు ఇవ్వబోతోందన్నారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుందన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లలో 25 శాతం ప్రైవేటు ఆస్పత్రులకు ఇస్తామని ప్రధాని తెలిపారు. అయితే ఒక్కో వ్యాక్సిన్ డోసుకు ప్రైవేటు ఆస్పత్రులు గరిష్టంగా 150 రూపాయలు మాత్రమ వసూలు చేయాలన్నారు. కరోనాతో పోరుతో భారత్ గెలిచి తీరుతుందని ప్రధాని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.