శివసేన నిప్పులు: 'డియర్ మోడీజీ'కి బదులు 'ప్రైమ్ మినిస్టర్'
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, దురదృకరమని, బీజేపీ ఇలాంటి వాటికి అస్సలు మద్దతివ్వబోదని స్పష్టం చేశారు. గత నెలలో ఉత్తరప్రదేశ్లోని దాద్రికి సమీపంలో ఓ గ్రామంలో పశుమాంసం తింటున్నాడనే అనుమానంతో మహ్మద్ అఖ్లఖ్ అనే ముస్లిం వ్యక్తిపై దాడి చేసి కొట్టి చంపిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనలో అతని కుమారుడు సైతం తీవ్రగాయాలుపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, వివిధ పార్టీలకు చెందిన నేతలు సైతం వారిని పరామర్శించారు.
అంతేకాదు, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మతపరమైన అంశాలను ప్రాథమికంగా చేసుకొని హిందు మతస్తులు కావాలనే దాడులు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ప్రధాని నరేంద్రమోడీ బెంగాలీ దినపత్రిక 'ఆనంద బజార్'కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు.

'దాద్రి, గులాం అలీ కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి ఘటనలు నిజంగా విచారకరం. దురదృష్టకరం. ఈ ఘటనల వెనుక కీలక అంశమేంటి? బీజేపీ ఇలాంటి ఘటనలకు మద్దతివ్వబోదు. ప్రతిపక్షాలు ఇలాంటి ఘటనలను రాజకీయాలు చేస్తున్నాయి. వాటి దొంగ లౌకికత్వానికి బీజేపీ విరుద్ధం' అని అన్నారు.
దీంతోపాటు పాకిస్థాన్ సింగర్ గులాం అలీపై, పాకిస్థాన్ మాజీ మంత్రి ఖుర్షీద్ మహ్మద్ కసూరి పుస్తక విడుదల కార్యక్రమం సందర్భంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఇంక్ దాడి ఘటనను సైతం ప్రధాని మోడీ ఖండించారు. అయితే ప్రధాని మోడీ ఖండించిన కొన్ని గంటల వ్యవధిలోనే శివసేన మోడీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేసింది.
గోద్రా లాంటి ఘటన వల్లే ఆయన్ను ఇంత కాలం గౌరవించామని శివసేన పార్టీ నేత సంజయ్ రౌత్ తెలిపారు. "గోద్రా, అహ్మదాబాద్ ఘటనల వల్లే ఆయనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ కారణంతోనే ఆయన్ను మేం గౌరవించాం. కానీ, ఈ తరహా వ్యాఖ్యలతో ఆయన మా దృష్టిలో 'డియర్ మోడీజీ' బదులుగా 'ప్రైమ్ మినిస్టర్' అయిపోయారు" అని విమర్శించారు.












Click it and Unblock the Notifications