శారీరకంగా ఫిట్టుంటే.. ఏ రంగంలోనైనా హిట్టే: ఫిట్ ఇండియా మూవ్మెంట్ ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన జీవితానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నరేంద్ర మోడీ గురువారం దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇండోర్(ఐజీఐ) స్టేడియంలో ఫిట్ ఇండియా మూవ్మెంట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పాల్గొన్నారు.

సరైన మార్గంలో సాంకేతికత
ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండటం(ఫిట్నెస్) మన జీవితంలో ఒక భాగమన్నారు. గతంలో శరీరక శ్రమతో మనుషులు దృఢంగా ఉండేవారని, ఇప్పుడు సమయాభావం, పనులు భిన్నంగా ఉండటం వల్ల ఫిట్నెస్కు దూరమవ్వాల్సి వస్తోందని అన్నారు.
‘కాలం మారిపోయింది. సాధారణంగా ప్రజలు సైకిల్ లేదా నడకను ఆశ్రయించాలి. సాంకేతికత పెరిగిన కారణంగా ఎంత నడిచామనే విషయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అందివచ్చిన టెక్నాలజీని సరైన మార్గంలో వాడుకోవాలి' అని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.

చిన్న పిల్లలకే డయాబెటీస్.. యువకులకు గుండెపోటు..
ఇటీవల కాలంలో భారతదేశంలో డయాబెటీస్, హైపర్టెన్షన్ పెరిగిపోతున్నాయి. 12-15ఏళ్ల పిల్లలకు కూడా డయాబెటీస్ రావడం ఆందోళన కలిగించే అంశం. ఇంతకుముందు 50-60ఏళ్ల వయస్సుల వారికి గుండె జబ్బులు వచ్చేవి.. కానీ, ఇప్పుడు 35-40ఏళ్ల వయస్సులోనే గుండెపోటు వస్తోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.

జీవనశైలిలో మార్పులతో
మారిన జీవనశైలితో మనం ఆరోగ్యానికి దూరమవుతున్నామని అన్నారు. సరైన మార్గంలో మనం జీవితాన్ని మలచుకుంటే ఆరోగ్యకరమైన జీవితం గడపవచ్చని ఆయన అన్నారు. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులతో అనేక రకాలైన రుగ్మతలను అధిగమించవచ్చని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. శారీరకంగా ఆరోగ్యం ఉంటే.. ఏ రంగంలోనైనా హిట్టు కావచ్చని వ్యాఖ్యానించారు.

ధ్యాన్చంద్ ఆశ్చర్యపర్చారు..
జాతీయ అభివృద్ధిలో ఫిట్నెస్ అనేది కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా క్రీడా దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ.. ధ్యాన్చంద్కు ఘన నివాళులర్పించారు. గొప్ప క్రీడాకారుడి జన్మదినం సందర్భంగా ఈ రోజు క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు మోడీ తెలిపారు. అతడు తన ఫిట్నెస్, స్టిమినా, హాకీ స్టిక్తో ప్రపంచాన్ని ఆశ్చర్యపర్చారని మోడీ గుర్తు చేశారు.
ప్రజలంతా పాల్గొనాలి..
ఫిట్ ఇండియా మూవ్మెంట్లో ప్రజలంతా పాల్గొనాలని మోడీ పిలుపునిచ్చారు. మహిళలు, చిన్నారులు, యువత అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. 11మంది మంత్రుల నేతృత్వంలో ఈ మూవ్మెంట్ నిర్వహించడం జరుగుతోంది. అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న భారత క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్, బాలీవుడ్ నటి శిల్పా శెట్టిలను ప్రధాని కలిశారు.












Click it and Unblock the Notifications