కోల్ సెక్టార్లో అతిపెద్ద సంస్కరణ... ప్రైవేట్ చేతికి 41 బొగ్గు గనులు.. వేలం ప్రక్రియ ప్రారంభం.
కోవిడ్-19 సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ సంక్షోభం భారత్కు స్వావలంబన నేర్పిందన్నారు. రాబోయే రోజుల్లో భారత్ విదేశీ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకోవాలనుకుంటోందని తెలిపారు. ఇందులో భాగంగా బొగ్గు సంస్కరణలపై కేంద్రం దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రపంచంలోనే భారత్ను అతిపెద్ద బొగ్గు ఎగుమతిదారుగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వేల ప్రక్రియ ప్రారంభించిన మోదీ
ఇందులో భాగంగా దేశంలో 41 బొగ్గు గనులను వేలం వేసి ప్రైవేటీకరించబోతున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా వేలం ప్రక్రియను ఆయన ప్రారంభించారు.ఇంధన శక్తి రంగంలో భారత్ స్వావలంబనకు ఈ సంస్కరణలు ఉపయోగపడుతాయన్నారు. దశాబ్దాలుగా కోల్ సెక్టార్ అనేక చిక్కుముళ్లతో ఉందన్నారు. పోటీతత్వానికి దూరంగా ఉందని,పారదర్శకత లోపించిందని అన్నారు. ఈ స్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు 2014 తర్వాత బీజేపీ సర్కార్ అనేక చర్యలు చేపట్టిందన్నారు.
రూ.20వేల కోట్ల పెట్టుబడులు
2030 నాటికి దేశంలో 100 మిలియన్ టన్నుల బొగ్గును గ్యాస్ అవసరాలకు వినియోగించబోతున్నట్టు తెలిపారు.ఇందుకోసం 4 ప్రాజెక్టులను చేపట్టబోతున్నామని.. రూ.20కోట్లు ఇందులో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు తెలిపారు. కమర్షియల్ కోల్ సెక్టార్ ద్వారా దేశంలో బొగ్గు రంగం మరింత బలోపేతం అవుతుందని.. స్వావలంబన పొందుతుందని తెలిపారు. ప్రైవేట్ బొగ్గు గనుల ద్వారా ఆదివాసీ,గిరిజన ప్రజలకు కూడా ప్రయోజనం చేకూరుతుందన్నారు. అలాగే ఎంతోమందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. దేశ స్వావలంబన కోల్ సెక్టార్ స్వావలంబన పైనే ఆధారపడి ఉందన్నారు.
Recommended Video
2.8లక్షల కొత్త ఉద్యోగాలు..
కోల్ సెక్టార్లో ప్రైవేట్ పెట్టుబడులు అతిపెద్ద సంస్కరణగా మోదీ అభివర్ణించారు. ఇకపై కోల్ రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం ఉంటుందని చెప్పారు. దీనికి సంబంధించిన అడ్డంకులను కూడా తొలగించినట్టు తెలిపారు. దేశంలో 41 బొగ్గు గనులను ప్రైవేటీకరించడం ద్వారా రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో రూ.33వేల కోట్ల మూల ధన పెట్టుబడులు పెరుగుతాయన్నారు. అలాగే రాష్ట్రాలకు ఈ బొగ్గు గనుల ద్వారా ఏటా రూ.20వేల కోట్లు ఆదాయం సమకూరుతుందన్నారు. అలాగే ప్రత్యక్షంగా,పరోక్షంగా కొత్తగా 2.8లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. 70వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు,2,10,000 మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందన్నారు. కమర్షియల్ మైనింగ్ను ప్రవేశపెట్టడం ద్వారా కోల్ సెక్టార్లో విస్తృత వాణిజ్యానికి భారత్ తలుపులు తెరిచిందన్నారు.