యూపీ అభివృద్ధి ప్రదాత యోగీ ఆదిత్యనాధ్- ప్రధాని మోడీ ప్రశంసలు
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే ఉత్తర్ ప్రదేశ్ లో ఇవాళ పర్యటించిన ప్రధాని నరేంద్రమోడీ అక్కడి యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. యూపీలో యోగీ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ ప్రధాని ఇవాళ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.. యూపీలోని అలీఘర్ లో ఇవాళ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ రాష్ట్ర యూనివర్శిటీకి శంఖుస్ధాపన చేసిన ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ మధ్యే మృతిచెందిన యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ ను గుర్తు చేసుకున్న ప్రధాని మోడీ.. అలీఘర్, పశ్చిమ ఉత్తర ప్రదేశ్లకు ఇదే గొప్ప రోజు అని అన్నారు. ఈరోజు రాధా అష్టమి సందర్భంగా మరింత పవిత్రమైనది. రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ అభివృద్ధి చూసి కళ్యాణ్ సింగ్ ఉండుంటే ఎంతో సంతోషించే వారని ప్రధాని మోడీ అన్నారు. దేశానికి అందించిన అనేక జాతీయ చిహ్నాలు, గత ప్రభుత్వాలు స్వాతంత్య్రం పొందినప్పటి నుండి దశాబ్దాలుగా విస్మరించబడ్డాయని ప్రధాని ఆవేదన వ్యక్తంచేశారు. కానీ నేడు, రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ జీతో మరెందరో ఈ గౌరవానికి అర్హులని ప్రధాని అన్నారు.

ఈ కార్యక్రమానికి ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరయ్యారు. స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సామాజిక సంస్కర్త అయిన ప్రముఖ జాట్ నేత రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ జ్ఞాపకార్థం ఈ విశ్వవిద్యాలయాన్ని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తోంది. అలీఘర్లోని కోల్ తహసీల్లోని లోధా, ముసేపూర్ కరీం జరౌలి గ్రామాల్లో ఈ విశ్వవిద్యాలయం 92 ఎకరాలకు పైగా ఉన్న స్ధలంలో ఏర్పాటు చేస్తోంది. అలీగఢ్ డివిజన్లోని 395 కళాశాలలు దీనికి అనుబంధంగా పనిచేయబోతున్నాయి.

వచ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసంతృప్త వర్గాల్ని బుజ్జగించే క్రమంలో బీజేపీ సర్కార్ ఈ యూనివర్శిటీని ఏర్పాటు చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ పారిశ్రామిక రక్షణ కారిడార్ అలీఘర్ నోడ్ యొక్క ఎగ్జిబిషన్ మోడళ్లను కూడా ప్రధాని మోడీ పరిశీలించారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ని ప్రశంసిస్తూ, రాష్ట్రంలో అభివృద్ధి దిశగా ప్రభుత్వం పనిచేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. నేడు, ఉత్తర ప్రదేశ్ దేశంలోని మరియు ప్రపంచంలోని ప్రతి చిన్న, పెద్ద పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారుతోంది. అభివృద్ధికి సరైన వాతావరణం సృష్టించబడినప్పుడు ఇది జరుగుతుంది" అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధికి వ్యతిరేకంగా ఉన్న శక్తులతో మనం పోరాడాలి. ఒకప్పుడు పరిపాలన గూండాల ద్వారా నడిచేది, అవినీతిపరుల చేతిలో పాలన ఉండేది, కానీ ఇప్పుడు అలాంటి వ్యక్తులు కటకటాల వెనుక ఉన్నారు" అని ప్రధాని మోదీ అన్నారు. రక్షణ కారిడార్ గురించి మాట్లాడుతూ, ప్రపంచ రక్షణ ఎగుమతిదారుగా తన గుర్తింపును చాటుకోవాలనే లక్ష్యంతో భారత్ ముందుకు సాగుతోందని ప్రధాని అన్నారు.












Click it and Unblock the Notifications