'న్యూ ఇండియా' పవర్ సింబల్.. కేవోపీటీకి శ్యామప్రసాద ముఖర్జీ పేరు.. మోదీ సభకు దూరంగా దీదీ
కేవలం ఒక కుటుంబానికే పేరు రావాలన్న దురుద్దేశంతో.. జాతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించిన ఎంతో మంది నేతలకు గత ప్రభుత్వాలు కనీస గుర్తింపును కూడా ఇవ్వలేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు. దేశంలో పారిశ్రామికీకరణకు పునాదులు వేయడంతోపాటు ఆ రంగాన్ని అభివృద్ధి చేసేందుకు భారతీయ జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యామ ప్రసాద ముఖర్జీ విశేషంగా పాటుపడ్డారని గుర్తుచేశారు.

పోర్టు పేరు మార్పు
రెండు రోజుల పర్యటన కోసం శనివారం కోల్కతా వచ్చిన ప్రధాని మోదీ.. ఆదివారం నేతాజీ స్టేడియంలో జరిగిన కోల్కతా పోర్టు ట్రస్ట్(కేవోపీటీ) 150వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ సభలో ఆయన మాట్లాడుతూ.. కేవోపీటీ పేరును డాక్టర్ శ్యామ ప్రసాద ముఖర్జీ పోర్టుగా మార్చుతున్నట్లు ప్రకటించారు. భారత్ పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి ముఖర్జీ తన వంతు బాధ్యత నిర్వహించారని, ఒకే దేశం-ఒకే రాజ్యాంగం ఆలోచన కూడా ఆయనదేనని మోదీ తెలిపారు.

ఆయన లెజెండ్..
స్వయం సమృద్ధితో ఎదిగిన కోల్ కతా పోర్టు ట్రస్టు.. దేశంలో పారిశ్రామిక ప్రగతితపోటు ఆధ్యాత్మిక ఏకీకరణకూ ప్రతీకగా నిలిచిందని, దాన్నలా నిలబెట్టడంలో ముఖర్జీ పాత్ర ఎంతో ఉందని ప్రధాని చెప్పారు. కోల్ కతా పోర్టును న్యూ ఇండియా పవర్ సింబల్ గా తీర్చిదుద్దుకోవాలని పిలుపునిచ్చారు. హిందుస్థాన్ ఎయిర్ క్రాఫ్ట్ కర్మాగారం, లోకోమోటివ్ కర్మాగారం, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ తదితర సంస్థల ఏర్పాటుకు పాటుపడ్డ లెజెండ్ ముఖర్జీ అని మోదీ తెలిపారు.

మాజీ ఉద్యోగులను సన్మానించిన మోదీ
1870లో ఈస్ట్ ఇండియా కంపెనీచే స్థాపింపబడి, కేంద్ర షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోన్న కోల్కతా పోర్ట్ ట్రస్ట్(కేవోపీటీ) 150వ వార్షికోత్సవాల్లో భాగంగా.. సంస్థ మాజీ ఉద్యోగులైన ఇద్దరు (నగీనా భగత్-105 ఏండ్లు, నరేశ్చంద్ర చక్రవర్తి-100ఏండ్లు) శతాధిక వృద్ధులను ప్రధాని మోదీ సన్మానించారు. అలాగే, రిటైర్డ్ ఉద్యోగులకు ఫైనల్ సెటిల్మెంట్ గా రూ.501 కోట్ల రూపాయల చెక్కును అందజేశారు.

దీదీ గైర్హాజరు..
శనివారం జరిగిన కార్యక్రమాల్లో ప్రధాని నరేంద్ర మోదీతోకలిసి వేదిక పంచుకున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ.. ఆదివారంనాటి కీలక కార్యక్రమాలకు మాత్రం డుమ్మాకొట్టారు. ఆహ్వనితుల జాబితాలో సీఎం పేరు ప్రముఖంగా చేర్చినప్పటికీ ఆమె రాలేదు. పౌరసత్వ సవరణ చట్టాలనికి వ్యతిరేకంగా కోల్ కతాలో నిర్వహించిన సభలో ఆమె పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications