Empty Talks- మోడీ సందేశంపై కాంగ్రెస్ రియాక్షన్ ఇదే
కరోనాపై పోరుకు సంబంధించి నిన్న ప్రధాని మోడీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంపై విపక్ష కాంగ్రెస్ పార్టీ మండిపడింది. ప్రధాని కీలక సమయంలో బాధ్యతారహితంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించింది. ప్రధానివి ఖాళీ ప్రకటనలు ( empty talks) గా కాంగ్రెస్ అభివర్ణించింది. వీటితో దేశానికి ఒరిగేదేమీ లేదని తెలిపింది.
Recommended Video
ప్రధాని తన ప్రసంగంలో ఆసుపత్రులలో పడకలు పెంచడం, ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం, సామాగ్రి క్రమబద్ధీకరణ, రెమ్డెసివిర్, టోసిలిజుమాబ్ వంటి మందులు అందుబాటులో ఉంచడం, వెంటిలేటర్ల సంఖ్య పెంపు, టీకాల పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ఏం చేసిందో ఆయన దేశానికి చెప్తారని భావించామని, కానీ ఇవన్నీ వదిలిపెట్టి ఎన్జీఓలు, యువత, బాల్ మిత్రాస్పై భారతదేశాన్ని రక్షించే బాధ్యత పెట్టారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్ ఆక్షేపించారు.
కేంద్రం బాధ్యత అయిన కరోనా నియంత్రణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలపైకి నెట్టి చేతులు దులుపుకున్నారని అజయ్ మాకెన్ ఆరోపించారు. లాక్డౌన్లు పెట్టకుండా పరిస్ధితిని నియంత్రించాలంటూ ప్రదాని మోడీ కోరడాన్ని కూడా మాకెన్ తప్పుబట్టారు. మరోవైపు ప్రధాని చెప్పినట్లు మన గురించి మనమే ఆలోచించుకుంటే మనం మరో ఉత్సవ్ లేదా మహోత్సవంలో మళ్లీ కలుసుకోవచ్చని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ట్వీట్ చేశారు.