మోడీకి సెకండ్ వేవ్ షాక్- రేటింగ్ ఢమాల్- యూఎస్ డేటా ఇంటెలిజిన్స్ సంస్ధ సర్వే
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ పాత్ర నానాటికీ ప్రశ్నార్ధకమవుతోంది. కరోనా నియంత్రణలో రాష్ట్రాలకు మార్గదర్శనం చేయాల్సిన కేంద్రం.. కనీసం వ్యాక్సిన్, ఆక్సిజన్ వంటి అత్యవసర విషయాల్లోనూ వైఫల్యాలు ఎదుర్కొంటోంది. దీంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతోంది. అదే సమయంలో ప్రధాని మోడీ ఆమోదయోగ్యత, ఆదరణ కూడా తగ్గుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా కరోనా కట్టడిలో ప్రధాని మోడీ నిష్క్రియాపరత్వాన్ని ఈ సర్వే ఫలితాలు మరోసారి గుర్తు చేశాయి.
కరోనాపై కేంద్రం హ్యాండ్సప్
ఈ ఏడాది మార్చిలో కరోనా సెకండ్వేవ్ వస్తుందన్న హెచ్చరికలు ఉన్నప్పటికీ అప్రమత్తం కాకుండా చివరి నిమిషం వరకూ ఎదురుచూసిన కేంద్రం ఇప్పుడు అందుకు తగిన మూల్యం చెల్లించుకుంటోంది. సెకండ్వేవ్ కట్టడి కోసం కేంద్రం ఆదరాబాదరాగా తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇవ్వకపోవడంతో రాష్ట్రాల దృష్టిలోనూ కేంద్రం నానాటికీ పలుచన అవుతోంది. ముఖ్యంగా కరోనా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రకటించి నెలరోజులు దాటిపోయినా ఇప్పటికీ 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయో వర్గాలకు ఇచ్చేందుకు వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి లేకపోవడం కేంద్రం ప్రతిష్టను దారుణంగా మసకబార్చింది.
మసకబారుతున్న మోడీ ప్రభ
కరోనా సెకండ్ వేవ్పై హెచ్చరికలు ఉన్నా సకాలంలో స్పందించడంలో విఫలమయ్యారన్న విమర్శల భారాన్ని ప్రస్తుతం ప్రధాని మోడీ మోయక తప్పడం లేదు. ముఖ్యంగా భారత్లో కేస్ లోడ్ తాజాగా 25 మిలియన్లు దాటిపోయింది. ఇందుకు సరైన వ్యూహరచన లేకపోవడమే కారణమనే వాదన అంతకంతకూ పెరుగుతోంది. ఇదే అంశంపై యూఎస్ డేటా ఇంటిలిజెన్స్ సంస్ధ మార్నింగ్ కన్సల్ట్ తాజాగా నిర్వహించిన సర్వేలోనూ ఇదే విషయం స్పష్టమైంది. ప్రపంచవ్యాప్తంగా డజను మంది ప్రభావవంతమైన నేతలపై నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాని మోడీకి షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి.
యూఎస్ సంస్ద తాజా సర్వేలో మోడీకి షాక్
యూఎస్ డేటా ఇంటిలిజెన్స్ సంస్ధ నిర్వహించిన తాజా సర్వేలో మోడీ ఓవరాల్ రేటింగ్స్ 63 శాతానికి పరిమితమయ్యాయి. 2019 ఆగస్టులో ఈ సంస్ధ తొలిసారి రేటింగ్స్ ఇవ్వడం ప్రారంభించింది. అప్పటి నుంచి చూసుకుంటే తొలిసారి ఏప్రిల్లో మోడీ బాగా ఆదరణ కోల్పోయారు. ఏప్రిల్లో మోడీ ఈ సర్వేలో ఏకంగా 22 పాయింట్లు కోల్పోయారు. పట్ఠణ ప్రాంతాల్లో ఎక్కువగా వైరస్ ప్రభావం ఉండటం, బెడ్లు, ఆక్సిజన్ దొరక్క జనం ఇబ్బందులు ఎదుర్కోవడం, కోవిడ్ మృతదేహాల అంత్యక్రియల విషయంలో ప్రభుత్వం నుంచి సాయం లభించడం లేదంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వంటివి మోడీ ఆదరణపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.
30 శాతం తగ్గిన మోడీ ఆదరణ
యూఎస్ డేటా ఇంటెలిజెన్స్ సంస్ధ నిర్వహించిన ఈ సర్వేలో పాల్గొన్న వారు తమ అభిప్రాయాల్ని కుండబద్దలు కొట్టారు. ఇందులో కోవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వ సామర్ద్యంపై ప్రజల్లో నమ్మకం ఫిబ్రవరి నుంచి తగ్గుతూ వస్తున్నట్లు తేలింది. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 59 శాతం మంది మాత్రమే కేంద్రం కోవిడ్ సెకండ్వేవ్ను సమర్ధంగా లేదా ఓ మోస్తరుగా బాగా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతేడాది కోవిడ్ ఫస్ట్ వేవ్ సందర్భంగా 89 శాతం మంది ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పగా.. ఇప్పుడు అది 59 శాతానికి చేరింది.
అయితే ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్న 2024 వరకూ సాధారణ ఎన్నికలను ఎదుర్కొనే అవకాశం లేనందున మోడీకి వచ్చిన నష్టమేమీ లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.