PM Modi: అమెరికాలో 2 రోజుల పాటు ప్రధాని పర్యటన.. ట్రంప్తో సమావేశానికి సన్నాహాలు!
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 12 నుంచి రెండు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో విస్తృత చర్చలు జరపనున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని అధికారిక వర్గాలు పీటీఐకి తెలిపినట్లు తెలిసింది. ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోడీ అమెరికాకు చేస్తున్న తొలి ద్వైపాక్షిక పర్యటన కావడం గమనార్హం. ప్రధాని తొలి పర్యటన భారత్-అమెరికా సంబంధాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. ఎందుకంటే ట్రంప్ పాలన ప్రారంభమైన తర్వాత వ్యక్తిగతంగా కలిసిన మొదటి విదేశీ నాయకులలో ప్రధాని నరేంద్ర మోడీ ఒకరు కానున్నారు.
ఫ్రాన్స్ టూర్ తర్వాత ఈ పర్యటన
రెండు రోజుల ఫ్రాన్స్ పర్యటన ముగిసిన వెంటనే ప్రధాని మోడీ అమెరికా పర్యటన జరగనుంది. ఫిబ్రవరి 10-11 తేదీలలో ఫ్రాన్స్ లోని గ్రాండ్ ప్యాలెస్ లో జరిగే ఏఐ యాక్షన్ సమ్మిట్ కు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఫ్రెంచ్ ప్రభుత్వం నిర్వహించే ఈ శిఖరాగ్ర సమావేశం ప్రపంచ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు, పలు రంగాల్లోని ప్రముఖులను ఒక చోట చేర్చి కృత్రిమ మేధస్సులో పురోగతులు, నియంత్రణలను చర్చిస్తుందని ఓ ప్రకటన వెలువడింది.

వాణిజ్యం, రక్షణ సహకారంపై దృష్టి సారిస్తాం..
ప్రధాని మోడీ అమెరికా పర్యటన అధికారిక వివరాలు ఇంకా వెలువడనప్పటికీ, చర్చలు వాణిజ్యం, రక్షణ సహకారం, ప్రాంతీయ భద్రత, ముఖ్యంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంపై దృష్టి సారిస్తారని భావిస్తున్నారు. జనవరి 20న అమెరికా 47వ అధ్యక్షుడిగా ట్రంప్ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం తర్వాత, జనవరి 27న ప్రధాని మోడీ ఆయనతో ఫోన్లో మాట్లాడారు.
వాణిజ్యం, ఇంధనం, రక్షణ సహకారం గురించి మాట్లాడుతూ.. పరస్పర భాగస్వామ్యానికి నిబద్ధతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రాతినిధ్యం వహించారు. విదేశాంగ మంత్రి కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడికి ప్రధాని మోడీ లేఖను కూడా అందజేశారు.












Click it and Unblock the Notifications