మారతారా ? మార్చమంటారా ? బీజేపీ ఎంపీలకు మోడీ వార్నింగ్-పార్లమెంట్ కు రాకపోవడంపై
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమై వారం రోజులు దాటిపోయింది. ఇప్పటికే విపక్షాల నిరసనల కారణంగా లోక్ సభ, రాజ్యసభ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతోంది. ఓవైపు దీన్ని కౌంటర్ చేసేందుకు కేంద్రం నానా తంటాలు పడుతోంది. రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ విధించారు. కీలకమైన వ్యవసాయ బిల్లుల్ని కేంద్రం వెనక్కి తీసుకుంది. దీంతో విపక్షాల నుంచి ఎదురుదాడి పెరిగింది అయినా కేంద్రం ఈ వ్యవహారంలో పైచేయి సాధించలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం బీజేపీ ఎంపీలు సమయానుకూలంగా స్పందించకపోవడమే కారణమని ప్రధాని మోడీ భావిస్తున్నారు.
పార్లమెంటు శీతాకాల సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలోని అంబేద్కర్ సెంటర్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఇందులో మాట్లాడిన ప్రధాని మోడీ... ఎంపీలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. పార్లమెంటులో హాజరు కాకుండా ఎంపీలు తప్పించుకుంటున్నారనే అర్ధం వచ్చేలా మోడీ సీరియస్ అయ్యారు. ఓ దశలో మీరు మారతారా లేకపోతే నన్నే మార్చమంటారా అంటూ వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. చిన్నపిల్లలు సైతం ఇన్నిసార్లు చెప్పించుకోరని ఆక్రోశం వ్యక్తం చేశారు. దీంతో ఎంపీలు అవాక్కయ్యారు.
ఉదయాన్నే సూర్యనమస్కారం చేసి పార్లమెంటుకు వచ్చే విషయంలో పోటీ పడండి. మనసు ప్రశాంతంగా ఉంటుందంటూ మోడీ ఎంపీల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశ ప్రజల కోసం పనిచేయాలని వారికి మోడీ సూచించారు. అంతే కాదు ఎంపీలంతా తమ నియోజకవర్గాల్లో క్రీడా పోటీలు నిర్వహించాలని కూడా కోరినట్లు పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు.
మరోవైపు గతంలో కూడా ప్రధాని మోడీ పలుమార్లు ఎంపీలకు ఇదే విధంగా హెచ్చరికలు చేశారు. వారి పనితీరు మార్చుకోవాలని పదే పదే కోరారు. అయినా ఎంపీలు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. దీంతో ఏకంగా ఈసారి వారినే మార్చేస్తానంటూ మోడీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఈసారైనా వారి తీరు మారుతుందా లేదా అన్నది మరో 15 రోజుల్లో ముగియనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తేలిపోనుంది.