సిఎంల భేటీ: గవర్నర్కు మోడీ కితాబు, మరిన్ని
న్యూఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర రావు, నారా చంద్రబాబు నాయుడు పరస్పరం సమావేశం కావడానికి చర్యలు తీసుకున్నందుకు గవర్నర్ నరసింహన్ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. నరసింహన్ శుక్రవారంనాడు మోడీతో సమావేశమయ్యారు. ఇరువురికి మధ్య మధ్యవర్తిగా వ్యవహరిస్తూ మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేయాలని కూడా ఆయన సూచించారు.
ముఖ్యమంత్రుల మధ్య, ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరించుకునేలా చూడాలని, దాని వల్ల కేంద్రంపై బరువు తగ్గుతుందని మోడీ నర్సింహన్తో అన్నట్లు సమాచారం.

ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలకు కారణమవుతున్న సమస్యలపై, గవర్నర్ తీసుకున్న చర్యలపై క్రమం తప్పకుండా నివేదికలు పంపాలని మోడీ సూచించినట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలకు కేంద్రం ఏం చేయాలనే విషయంపై కూడా సలహాలు ఇవ్వాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధ్యమైనంత త్వరగా ప్రత్యేక హోదా కల్పించి నిధులు విడుదల చేయాలని గవర్నర్ ప్రధానిని కోరినట్లు సమాచారం. తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి కరీంనగర్లో 4000 మెగావాట్ల థర్మల్ స్టేషన్ స్థాపనకు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా గవర్నర్ ప్రధానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications