విపక్షాల విమర్శలపై మోదీ సర్కార్ బ్రహ్మాస్త్రం
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో కమ్యూనికేషన్ రంగం ఓ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. ఓ సరికొత్త విప్లవాన్ని సృష్టించింది. తాము అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులు, ఇతర కార్యకాలాపాలన్నీ కూడా దేశ ప్రజలందరికీ చేరవేసేలా సమాచార రంగాన్ని బలోపేతం చేశారు.
ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, అమలు చేయదలిచిన పథకాలు, విధానాలు, సాధించిన ఘన విజయాల గురించి ప్రజలకు తెలియజేయడంలో చురుగ్గా పాల్గొనాలంటూ మోదీ ఇటీవలే ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రతిపక్షం చేస్తోన్న తప్పుడు కథనాలు, నిరాధార వార్తలు, దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాని మోదీ బలంగా నమ్ముతున్నారు.

దానికి అనుగుణంగా ఆయన తన ఆదేశాలను మంత్రివర్గ సహచరులు, అధికారులకు జారీ చేశారు. ప్రభుత్వం సాధించిన విజయాలను మసి పూసే అవకాశం ప్రతిపక్షాలకు ఎంతమాత్రం కూడా ఇవ్వకూడదనేది మోదీ అభిప్రాయం.
రాజకీయ రంగంలో కొనసాగుతున్నప్పుడు తప్పుడు కథనాలు, అవాస్తవ ప్రచారాలను నియంత్రించడం చాలా కీలకం అనేది తెలిసిందే. అలాంటి కథనాలు ప్రజల అభిప్రాయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. వివిధ అంశాలపై వారికి అవగాహనలకు బదులుగా గందరగోళానికి గురి చేస్తాయి. అది- చివరికి ఎన్నికలపై ప్రభావం చూపుతుంది.
ప్రతిపక్షాలు తరచుగా పాలన లోపాలపై దృష్టి సారించడం, ప్రభుత్వ విధానాలు అకారణంగా విమర్శించడం వంటి ప్రయత్నాలు సాగిస్తుంటుంది. ప్రభుత్వ ఉద్దేశాలను తీవ్రంగా ప్రభావితం చేసేలా కథనాలను వండి వార్చుతుంది. ప్రజలకు తమ ప్రభుత్వ పనితీరును గురించి తెలియజేయడం, ఖచ్చితమైన సమాచారాన్ని వారికి అందించడం, విశ్వసనీయతను కాపాడుకోవడం అత్యవసరం.
ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సమయంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు- ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దుష్ప్రచారం చేశాయి. దేశ ప్రజాస్వామ్య పునాదులను దెబ్బతీసేలా, రాజ్యాంగంలో భారీ మార్పులు చేయాలనే ఉద్దేశంలో బీజేపీ ఉందంటూ కాంగ్రెస్ ఆరోపించింది.
ఓటర్లలో లేనిపోని భయాలు, కొత్త అనుమానాలను సృష్టించడానికే ప్రతిపక్షాలు అలాంటి దుష్ప్రచారం సాగించాయని బీజేపీ భావిస్తోంది. ఆయా ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని, ప్రజలను తప్పుదోవ పట్టించడానికే సాగించిన ప్రయత్నాలుగా ప్రధాని మోదీ కొట్టిపారేశారు. బీజేపీ సైతం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలు సాగించిన దుష్ప్రచారాల ప్రధాన ఉద్దేశం ఇదే. బీజేపీ మాత్రం అలాంటి మార్పులు చేసే ఉద్దేశం లేదని ప్రజలకు పదే పదే హామీ ఇస్తోంది. రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఉద్దేశం తమకు లేదనే విషయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రులు, పదాధికారుల సమావేశాల్లో స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం ముస్లింల పట్ల అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తోందని, వారిని భయాందోళనలకు గురిచేసే వాతావరణాన్ని సృష్టిస్తోందనేది ప్రతిపక్షాల మరో ముఖ్య వాదన. వారి సంక్షేమానికి ముప్పుగా పరిణమిస్తుందనే భయాన్ని కలిగించడమే దాని ఉద్దేశం. తద్వారా బీజేపీకి వ్యతిరేకంగా మైనారిటీ ఓట్లను కూడగట్టాలని భావించింది.
ఈ పాచిక పారలేదు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో సమ్మిళిత అభివృద్ధికి బాటలు వేసింది. నిబద్ధతతో సాధించిన విజయాలతో ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టింది. కులం, మతం, సామాజికవర్గాలకు అతీతంగా పౌరులందరికీ ప్రయోజనం చేకూర్చేలా సంక్షేమ పథకాలు రూపొందించామంటూ ప్రధాని మోదీ పదేపదే ప్రకటించారు.
జాతీయ భద్రత విషయంలో ప్రత్యేకించి- లడఖ్లో చైనా చొరబాట్లకు సంబంధించి ప్రతిపక్షం ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది. భారత ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో బీజేపీ విఫలమైందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిపై బీజేపీ సమర్థవంతంగా ఎదురుదాడి చేయగలిగింది.
చైనాకు ఒక్క అంగుళం కూడా భారత భూభాగాన్ని కోల్పోలేదంటూ కుండబద్దలు కొట్టింది. దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి గణనీయమైన చర్యలు తీసుకున్నామంటూ బలంగా చెప్పగలిగింది. తన వాదనలను వినిపించగలిగింది. ఈ ఉద్దేశంతోనే సమాచార రంగాన్ని, కమ్యూనికేషన్ ప్రాముఖ్యత ఇటీవలి కాలంలో మంత్రులు, ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ ప్రస్తావించారు.
సమయానుకూలంగా, సమర్థవంతంగా కమ్యూనికేషన్ రంగాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. తప్పుడు కథనాలను ఎదుర్కోవడానికి మాత్రమే కాకుండా పాలనలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి కూడా మాధ్యమాలను వినియోగించడం అత్యవసరమని సూచించారు.
కేంద్ర పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ అధికారులను భాగస్వామ్యం చేయడాన్నీ మోదీ ప్రస్తావించారు. ఇది- దేశ ఫెడరల్ వ్యవస్థ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతను స్పష్టం చేసినట్టయింది. సమాచార మాధ్యమాల వినియోగంపై ప్రధాని ఇస్తోన్న ఆదేశాలు కూడా ఆయనకు ఉన్న సమగ్ర అవగాహనకు అద్దం పట్టినట్టయింది.
తాము చేస్తోన్న మంచి ప్రజలకు తెలియజేయడం, తప్పుడు సమాచారాన్ని అడ్డుకోవడంలో చురుగ్గా వ్యవహరించడం ద్వారా ప్రధాని మోదీ ప్రభుత్వం తాము సాగిస్తోన్న అభివృద్ధి, సుపరిపాలనపై మరింత పట్టును సాధించిందనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
తప్పుడు సమాచారం త్వరగా వ్యాప్తి చెందే ఈ యుగంలో ప్రభుత్వ విధానాలు, విజయాల గురించి ప్రజలకు ఖచ్చితమైన, సమయానుకూల సమాచారం అందేలా చూసుకోవడం చాలా కీలకం. పారదర్శకత, జవాబుదారీతనం, సమర్థవంతమైన కమ్యూనికేషన్పై మోడీ ప్రభుత్వం దృష్టి సారించింది. సమర్థవంతంగా పాలించడమే కాకుండా రాజకీయ రంగంలో దుష్ప్రచార కథనాల యుద్ధంలో సైతం విజయం సాధించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.












Click it and Unblock the Notifications