నరేంద్రమోడీ తర్వాత టార్గెట్ ఆ సీనియర్ నేతే??
నరేంద్రమోడీ, అమిత్ షా గుజరాత్ రాజకీయాలకే పరిమితమైనప్పుడు దేశవ్యాప్తంగా భారతీయ జనతాపార్టీని విస్తరించడంలోను, బలోపేతం చేయడంలోను వారంతా దోహదపడ్డారు. ఎప్పుడైతే నరేంద్రమోడీ ప్రధానమంత్రి అయ్యారో, అమిత్ షా బీజేపీ అధ్యక్షుడయ్యారో వారందరికీ రాజకీయంగా ప్రాధాన్యత తగ్గడం ప్రారంభమైంది. లాల్కృష్ణ అద్వానీ, వెంకయ్యనాయుడు నుంచి నితిన్ గడ్కరీ, శివరాజ్సింగ్ చౌహాన్ వరకు ఎందరో క్రమ క్రమంగా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నారు.

75 సంవత్సరాల నిబంధన వర్తిస్తుందా? లేదా?
పార్టీలోనైనా, ప్రభుత్వంలోనైనా 75 సంవత్సరాలు దాటిన తర్వాత ఎటువంటి పదవి చేపట్టకూడదనే నిబంధనలను మోడీ హయాంలో బీజేపీ తీసుకువచ్చింది. వచ్చే ఎన్నికల సమయానికి మోడీకి 75 సంవత్సరాలు వస్తాయి. మరి ఆ నిబంధన ఆయనకు వర్తిస్తుందా? లేదా? అనేదానిపైనే ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ఆ లోటును దక్షిణాదిలో పూడ్చుకుందామని బీజేపీ అధినాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఒకవేళ సీట్లు తక్కువగా వస్తే ఇతర పార్టీల మద్దతు అవసరమైనప్పుడు మోడీకి పోటీగా నితిన్ గడ్కరీ ఉంటారు. ఆర్ఎస్ఎస్ సీనియర్ నేతగా, సమర్థవంతమైన వ్యక్తిగా, కేంద్ర మంత్రిగా సుదీర్ఘ కాలం పనిచేయడమే కాకుండా సెక్యులరిజం మేళవించిన బీజేపీ నేతగా విశ్లేషకులు చెబుతారు.

రాజ్ నాథ్ సింగ్ ఒక్కరే మిగిలారు..
మోడీకి ప్రత్యామ్నాయంగా గడ్కరీ నిలుస్తారు. ఇతర పార్టీల మద్దతు అవసరమైనప్పుడు అందరూ గడ్కరీకే మద్దతిస్తారు. ఈ ఉద్దేశంతోనే పార్లమెంటరీ బోర్డునుంచి ఆయన్ను సాగనంపారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాజ్పేయి హయాంలో ఉన్న సీనియర్ నేతలంతా దాదాపుగా కనుమరుగైపోయారు. ఇక మిగిలింది రాజ్నాథ్ సింగ్ ఒక్కరే. పార్లమెంటరీ బోర్డులో ఉన్న సీనియర్ నేత ఆయన ఒక్కరే. ఎన్నికల కమిటీని పునర్వ్యవస్థీకరించిన సమయంలోను నితిన్ కు, చౌహాన్కు చోటు దక్కలేదు. 77 సంవత్సరాల వయసున్న యడ్యూరప్పకుచోటు దక్కింది. కర్ణాటకలో గెలవాలంటే బలమైన లింగాయత్ వర్గమైన యడ్యూరప్ప కీలక పదవిలో ఉండాలనే కోణంలో పదవి కట్టబెట్టినట్లుగా భావిస్తున్నారు.

యూపీకి చెందిన కీలక నేత
బీజేపీలో ఇప్పడు ఉన్న నేతలంతా నరేంద్రమోడీ, అమిత్ షా చలవల్ల పైకి వచ్చినవాళ్లే. సీనియర్ నేతలంటూ ఎవరూ మిగల్లేదు. రాజ్ నాథ్ సింగ్ ను కొంతకాలం ఉంచుతారని, తర్వాత ఆయన్నికూడా పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆయన బలమైన నేత. రేపటి రోజున ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే యూపీ నుంచి మెజారిటీ సీట్లు సాధించుకోవాలి. రాజ్ నాథ్ ను సాగనంపితే రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని భావించడంవల్లే ప్రస్తుతానికి ఆయన జోలికి వెళ్లడంలేదని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications